మహామహుల ఓటమి
ABN , First Publish Date - 2022-03-11T07:42:54+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన కంచుకోట పటియాలాలో
మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన కంచుకోట పటియాలాలో 19,873 ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ స్థానంలో ఆప్ అభ్యర్థి అజిత్పాల్ సింగ్ కోహ్లీ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టినా.. అమరీందర్ ఈ ఎన్నికల్లో రాణించలేకపోయారు. పీసీసీ చీఫ్ నవ్జోత్ సింగ్ సిద్దూ కూడా అమృత్సర్(తూర్పు) నియోజకవర్గం నుంచి 6,750 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి/ఆప్ నేత జీవన్జ్యోత్ కౌర్ చేతిలో ఓటమిపాలయ్యారు.
మరో మాజీ సీఎం/ఎ్సఏడీ చీఫ్ ప్రకాశ్ సింగ్ బాదల్ తన కంచుకోట లంబీ నియోజకవర్గం నుంచి పోటీచేసి.. ఆప్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుడియన్ చేతిలో 11,396 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. భదౌర్, చమ్కౌర్ సాహిబ్ స్థానాల నుంచి ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ నేత/తాజా మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ ఛన్నీ ఆ రెండు స్థానాల్లో ఓటమిపాలయ్యారు. భదౌర్లో ఆప్ అభ్యర్థి లాభ్సింగ్(పారిశుధ్య కార్మికురాలి కుమారుడు) 37,558 ఓట్ల మెజారిటీతో, చమ్కౌర్ సాహిబ్లో ఆప్ అభ్యర్థి చరణ్జీత్ 7,942 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఛన్నీ మంత్రివర్గంలో సగం మంది ఓటమిపాలయ్యారు. ఎస్ఏడీని ముందుండి నడిపించిన సుఖ్బీర్ సింగ్ బాదల్ జలాలాబాద్ నుంచి ఓటమిపాలయ్యారు.
అదే సమయంలో పంజాబ్ సీఎం అభ్యర్థి భగ్వంత్ మాన్ ధూరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యే దల్వీర్సింగ్ను మట్టి కరిపించి.. 58,206 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆప్ హవాతో.. రైతు సంఘం నేతలు కూడా ఓటమిపాలయ్యారు. సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో ఎన్నికల బరిలో నిలిచిన చాలా మంది రైతులు.. ఆప్కు మద్దతుగా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.