Longest Bridge: భారత్-బంగ్లాదేశ్ మధ్య దూరం తగ్గింది!

ABN , First Publish Date - 2022-06-26T17:26:46+05:30 IST

బంగ్లాదేశ్‌లో అతి పెద్ద అభివృద్ధి ప్రాజెక్టు పద్మ వంతెనను ఆ దేశ

Longest Bridge: భారత్-బంగ్లాదేశ్ మధ్య దూరం తగ్గింది!

ఢాకా : బంగ్లాదేశ్‌లో అతి పెద్ద అభివృద్ధి ప్రాజెక్టు పద్మ వంతెనను ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా (Sheik Hasina) శనివారం ప్రారంభించారు. దీంతో భారత్-బంగ్లాదేశ్ (India-Bangladesh) మరింత చేరువవుతున్నాయి. అందరూ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ వంతెన అందుబాటులోకి రావడంతో రైలు, రోడ్డు, నౌకాశ్రయాల ద్వారా ప్రయాణ కాలం, దూరం తగ్గుతాయి. 


షేక్ హసీనా మాట్లాడుతూ, ఈ వంతెన కేవలం ఇటుకలు, సిమెంటు, ఇనుము, కాంక్రీటు మాత్రమేకాదని, ఇది మనకు గర్వకారణమని తెలిపారు. మన శక్తి, సామర్థ్యాలు, దృఢత్వం, హుందాతనాలకు ప్రతీక అని తెలిపారు. 


పద్మ వంతెన (Padma Bridge) ప్రారంభోత్సవం సందర్భంగా భారత ఎంబసీ శుభాకాంక్షలు తెలిపింది,  షేక్ హసీనాను ప్రశంసించింది. ఆమె సాహసోపేత నిర్ణయాలు, దార్శనిక నాయకత్వాలకు సజీవ సాక్ష్యం ఈ వంతెన అని పేర్కొంది. ఆమె దృఢ నిశ్చయం ఈ విజయంతో రుజువైందని పేర్కొంది. దీనికి సాటిలేని రీతిలో భారత్ మద్దతిచ్చిందని తెలిపింది. 


బంగ్లాదేశ్ 1971లో ఏర్పడింది. అప్పటి నుంచి చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల్లో పద్మ వంతెన ప్రాజెక్టు అతి పెద్దది. రైలు, రోడ్డు, నౌకాశ్రయాల ద్వారా భారత్‌ను నేరుగా బంగ్లాదేశ్‌తో కలిపే ఈ వంతెన పొడవు దాదాపు 6.2 కిలోమీటర్లు. ఇది నాలుగు లేన్ల రోడ్డు, రైలు వంతెన. పద్మ నదిపై దీనిని నిర్మించారు. బంగ్లాదేశ్ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇంచుమించు 3 కోట్ల మంది జీవితాలను మార్చుతుందని చెప్తున్నారు. 


ఈ వంతెనకు చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనిని పూర్తిగా స్వదేశీ నిధులతో నిర్మించారు. దీని నిర్మాణం కోసం 1.2 బిలియన్ డాలర్ల రుణం ఇస్తామని ప్రపంచ బ్యాంకు (World Bank) చెప్పినప్పటికీ, అవినీతిని సాకుగా చూపి, ఆ రుణాన్ని రద్దు చేస్తున్నట్లు 2012లో ప్రకటించింది. 


భారత దేశ సరిహద్దుల్లోని బేనపోల్ నుంచి నుంచి బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకా (Dhaka) దూరం రోడ్డు మార్గంలో ఈ వంతెన వల్ల దాదాపు 70 కిలోమీటర్లు తగ్గిపోతుంది. ఫలితంగా ప్రయాణ కాలం 4.30 గంటలు ఆదా అవుతుంది. అంతేకాకుండా కోల్‌కతా-ఢాకా (Kolkata-Dhaka) రైలు ప్రయాణ కాలం సగానికి తగ్గిపోతుంది. 


భారత్, నేపాల్, చైనా, మయన్మార్, సింగపూర్, థాయ్‌లాండ్‌లను పద్మ వంతెన అనుసంధానం చేస్తోంది. ట్రాన్స్ ఆసియన్ హైవే నెట్‌వర్క్ (TAHN)లో ఇది ముఖ్యమైనది. దీనిలో 16 రోడ్డు మార్గాలు ఉన్నాయి. వీటిలో మూడు మార్గాలు బంగ్లాదేశ్ గుండా వెళ్తున్నాయి. రైల్ లింక్ మరో రెండు మార్గాలను కలుపుతుంది.


Updated Date - 2022-06-26T17:26:46+05:30 IST