కరీంనగర్ డెయిరీని విస్తరించడం అభినందనీయం
ABN , First Publish Date - 2021-01-16T05:05:25+05:30 IST
పాల సేకరణ, విక్రయాలకే పరిమితం కాకుండా కరీంనగర్ డెయిరీని మరింత అభివృద్ధి పరిచేందుకు పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, జనవరి 15: పాల సేకరణ, విక్రయాలకే పరిమితం కాకుండా కరీంనగర్ డెయిరీని మరింత అభివృద్ధి పరిచేందుకు పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం పద్మనగర్లోని డెయిరీ ఆవరణలో కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను డెయిరీ చైర్మన్ సీహెచ్రాజేశ్వర్రావు, మేయర్ వై సునీల్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ డెయిరీ రూపొందించిన నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోజురోజుకు వ్యాపారాన్ని విస్తరిస్తూ దాదాపు 70వేల మంది పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చడంలో చైర్మన్ రాజేశ్వర్రావు, పాలకవర్గం కృషి ఎంతగానో ఉందని అన్నారు. కరీంనగర్ డెయిరీకి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని, మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, డిండిగాల మహేశ్, తోట రాములు, కాశెట్టి శ్రీనివాస్, డెయిరీ అఽధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.