బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2021-10-18T04:49:24+05:30 IST
జడ్చర్లలో శనివారం కురిసిన భారీ వర్షానికి నీటిలో కొట్టుకుపోయి మృతిచెందిన రాఘవేందర్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 20లక్షల ఆర్థిక సాయం అందజేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి కోరారు.
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి
బాదేపల్లి, అక్టోబరు 17 : జడ్చర్లలో శనివారం కురిసిన భారీ వర్షానికి నీటిలో కొట్టుకుపోయి మృతిచెందిన రాఘవేందర్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 20లక్షల ఆర్థిక సాయం అందజేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి కోరారు. ఆదివారం ఆయన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షానికి వరదలో కుట్టుకుపోయి మృతిచెందిన రాఘవేందర్ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షానికి నష్టపోయిన బాధిత కుటుంబాలకు తక్షణమే రూ. రెండు లక్షలు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రాఘవేందర్ది చాలా నిరుపేద కుటుం బమని, కొవిడ్ కారణంగా అతని సోదరుడు కూడా మృతి చెందాడని గుర్తు చేశారు. ఇప్పుడు రాఘవేందర్ కూడా మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కుమ్మరి రాజు, వెంకట్రాంరెడ్డి, నాయకురాలు సాహితిరెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.