పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి : చైర్మన్ ఈశ్వర్
ABN , First Publish Date - 2022-07-07T07:34:11+05:30 IST
బక్రీద్ పండగను శాంతియుతంగా జరుపుకోవాలని మున్సిపల్ చైర్మ న్ గండ్రత్ ఈశ్వర్, డీఎస్పీ జీవన్రెడ్డిలు సూచించారు.
నిర్మల్ చైన్గేట్, జూలై 6 (ఆంధ్ర జ్యోతి) : బక్రీద్ పండగను శాంతియుతంగా జరుపుకోవాలని మున్సిపల్ చైర్మ న్ గండ్రత్ ఈశ్వర్, డీఎస్పీ జీవన్రెడ్డిలు సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం డిఎస్పీ ఉపేంధర్రెడ్డితో కలిసి ముస్లీం మతపెద్దలు, కౌన్సిలర్లు, స్వచ్చంద సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 10న నిర్వహించే బక్రీద్ పండగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. నిర్మల్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని పండగలను శాంతియుతంగా ఐక్యమత్యంగా జరుపుకుంటారన్నారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కృషితో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని, అసత్య ప్రచారం చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సాంప్రదాయ బద్దంగా పండగలను జరుపుకోవాలని , చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జీ ఆర్డీఓ తుకారాం, మున్సిపల్ కమిషనర్ అరిగెల సంపత్కుమార్, పట్టణ సీఐశ్రీనివాస్, అర్బన్ తహసీల్దార్ సుభాష్చందర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.