వరద గాయం వెయ్యి కోట్ల పైనే

ABN , First Publish Date - 2021-11-30T06:46:12+05:30 IST

జిల్లాకు వరద చేసిన నష్టాన్ని అంచనా వేయడంలో అధికార యంత్రాంగం తలమునకలై ఉంది.

వరద గాయం వెయ్యి కోట్ల పైనే
చిత్తూరు పునరావాస కేంద్రం(జైహింద్‌ స్కూల్‌)లో నిరాశ్రయులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

చిత్తూరు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాకు వరద చేసిన నష్టాన్ని అంచనా వేయడంలో అధికార యంత్రాంగం తలమునకలై ఉంది. శాఖల వారీగా లెక్కలు తీస్తున్నారు. జిల్లాలో వరద కష్టం తీర్చడానికి రూ.వెయ్యి కోట్లకుపైగా అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.  ఇప్పటికే 34,685 మంది నిరాశ్రయులకు రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. 11వేల మంది నిరాశ్రయులను పునరావాస కేంద్రాల్లో ఉంచారు. జాయింట్‌ కలెక్టర్లు వరద ముంపు ప్రాంతాలను పంచుకుని నిరంతరం పర్యటిస్తున్నారు. వరద పరిస్థితులను అంచనా వేయడానికి ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, కలెక్టర్‌ హరినారాయణన్‌ నిత్యం వరద ముంపు ప్రాంతాలను, జలాశయాలను, ప్రమాదకర ప్రాంతాలను సందర్శిస్తూ.. స్థానిక అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఆయా శాఖల ఉద్యోగులు పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు సెలవులు పెట్టకుండా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించారు. మండలాల్లో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎస్‌ఐ, వ్యవసాయ, ఇరిగేషన్‌ తదితర శాఖల అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ, వరద నష్టాన్ని అంచనా వేస్తూ.. బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. జిల్లాలోని వరద పరిస్థితులు, జరిగిన నష్టాల గురించి సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన వీడియోకాన్ఫెరెన్సులో సీఎం జగన్‌కు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఈ వివరాలు తెలియజేశారు. 

Updated Date - 2021-11-30T06:46:12+05:30 IST