Sad: కూతురి జీవితంతో ఏ తల్లీ ఆడని దుష్ట క్రీడ ఇది..
ABN , First Publish Date - 2022-07-15T01:35:28+05:30 IST
తమిళనాడులో వైద్యఆరోగ్య శాఖ నాలుగు ఆసుపత్రులపై కొరడా ఝళిపించింది. నాలుగు ఆసుపత్రులను..
చెన్నై: తమిళనాడులో (Tamilnadu) వైద్యఆరోగ్య శాఖ (Health Ministry) నాలుగు ఆసుపత్రులపై (Four Hospitals) కొరడా ఝళిపించింది. నాలుగు ఆసుపత్రులను శాశ్వతంగా మూసివేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 16 ఏళ్ల బాలిక (16 Year Old Girl) అండ కణాలను కొనుగోలు చేసిన వ్యవహారంలో ఈ ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంది. సరోగసీ నిమిత్తం ఆ బాలిక అండ కణాలను ఆ ఆసుపత్రులు సేకరించినట్లు తెలిసింది. తల్లి ఒత్తిడి చేసి మరీ ఆ బాలిక అండ కణాలను ఎనిమిది సార్లు పలు ఫెర్టిలిటీ సెంటర్లకు అమ్ముకున్నట్లు బయటపడింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎంఏ సుబ్రమణ్యన్ మాట్లాడుతూ.. 21 నుంచి 35 ఏళ్ల వయసులోపు పెళ్లయి బిడ్డ ఉన్న మహిళ.. ఆమె కూడా ఒకసారి మాత్రమే స్త్రీ బీజ మాతృ కణాలను దానం చేసేందుకు వీలుందని చెప్పారు. కానీ.. ఈ ఘటనలో 16 ఏళ్ల బాలిక Egg Cells ను పలుమార్లు తన తల్లి ఒత్తిడి చేసి దానం చేయించిందని మంత్రి తెలిపారు. ఆధార్ కార్డును ఫోర్జరీ చేసి మరీ మైనర్ అయిన ఆ బాలికను మేజర్గా చూపించారని.. ఆ బాలికకు పెళ్లయినట్లు.. అతని అంగీకారంతోనే Egg Cells ను డొనేట్ చేస్తున్నట్లుగా కల్పిత కథను అల్లి మరీ ఇలా చేసినట్లు మంత్రి వెల్లడించారు.
Reproductive Technology Act ను ఉల్లంఘించినందుకు ఆ హాస్పిటల్స్పై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఆధార్, పోక్సో చట్టాల కింద కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాదు.. ఇలా చేసినందుకు ఆ ఆసుపత్రులకు రూ.50 లక్షల వరకూ జరిమానా కూడా విధించామని, బాధ్యులైన వైద్యులపై కూడా కేసు నమోదు చేశామని, పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రుల్లో ఉన్న రోగులను దృష్టిలో ఉంచుకుని మూసివేతకు రెండు వారాల గడువు ఇచ్చినట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లోని ఒక హాస్పిటల్, కేరళలోని మరో హాస్పిటల్ పాత్ర కూడా ఉందని.. ఆ హాస్పిటల్స్పై కూడా చర్యలు తీసుకోవాలని హెల్త్ సెక్రటరీ ప్రతిపాదించారు.