గిరిజనుల ప్రాణ రక్షణే లక్ష్యం
ABN , First Publish Date - 2021-05-11T05:07:49+05:30 IST
గిరిజనుల ప్రాణాలను కాపాడడం కంటే ఏది ముఖ్యం కాదని, వారి ప్రాణాలను రక్షించడమే మన లక్ష్యమని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్లో ఐటీడీఏ పీవో ఎస్.వెంకటేశ్వర్
కొవిడ్పై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
పాడేరు, మే 10: గిరిజనుల ప్రాణాలను కాపాడడం కంటే ఏది ముఖ్యం కాదని, వారి ప్రాణాలను రక్షించడమే మన లక్ష్యమని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయం నుంచి ఏజెన్సీ మండలాల వైద్యులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏటీడబ్ల్యూవోతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. మన్యంలో కొవిడ్ నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే వ్యాక్సి నేషన్ జరిగే కేంద్రంలో ఒక మహిళా పోలీస్, ఒక డిజిటల్ అసిస్టెంటు తప్పనిసరిగా విధులు నిర్వహిం చాలన్నారు. సచివాలయం యంత్రాంగం కొవిడ్పైనే దృష్టి పెట్టాలని, బాధితులు ఆస్పత్రికి తరలించే బాధ్యత పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలపైనే ఉందన్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న కొవిడ్ బాధితుల ఆక్సిజన్ స్థాయిలను ప్రతీరోజు తనిఖీ చేయాలన్నారు. అరకులోయ, చింతపల్లి మండల కేంద్రాలలో కొవిడ్ కేర్ సెంటర్లు సిద్ధం చేయాలని పీవో ఆదేశించారు. రాపిడ్ టెస్టింగ్ కిట్లను పీహెచ్సీలకు సరఫరా చేస్తామన్నారు. అలాగే మలేరియాపై నిర్లక్ష్యం చేయకూడదన్నారు. దోమల నివారణ మందు పిచికారి పనులు వేగంగా జరగాలన్నారు. కొవిడ్ నిర్థారణ పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఏడీఎంహెచ్వో డాక్టర్ లీలాప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 31 వరకు రెండో విడత వ్యాక్సినేషన్ మాత్రమే వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆర్డీవో కేఎల్.శివజ్యోతి మాట్లాడుతూ.. ఏజెన్సీలో ఈనెల 15లోగా రేషన్ పంపణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ విద్యా శాఖ ఉప సంచాలకుడు జి.విజయకుమార్, డీఎల్పీవో పీఎస్.కుమార్, ఏటీడబ్ల్యూవో ఎల్.రజని, తదితరులు పాల్గొన్నారు.