మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు

ABN , First Publish Date - 2021-01-17T06:00:32+05:30 IST

ప్రభుత్వ పథకాల రూపకల్పనలోనూ, వాటి అమల్లోనూ మహిళా సాధికారత ఉట్టిపడేలా లక్ష్యాలు వుండాలని, అప్పుడే మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ ప్రతా్‌పరావు జాదవ్‌ అన్నారు.

మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు
రైతులతో మాట్లాడుతున్న పార్లమెంటరీ కమిటీ సభ్యులు

జిల్లాలో అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం


చిత్తూరు కలెక్టరేట్‌/కల్లూరు/భాకరాపేట, జనవరి 16: ప్రభుత్వ పథకాల రూపకల్పనలోనూ, వాటి అమల్లోనూ మహిళా సాధికారత ఉట్టిపడేలా లక్ష్యాలు వుండాలని, అప్పుడే మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ ప్రతా్‌పరావు జాదవ్‌ అన్నారు. శనివారం  ప్రతా్‌పరావు జాదవ్‌ అధ్యక్షతన కమిటీ బృందం జిల్లాలోని చిన్నగొట్టిగల్లు,  పులిచెర్ల మండలాల్లో పర్యటించింది. ఎంపీలు తలారి రంగయ్య(అనంతపురం), సుజిత్‌కుమార్‌(ఒడిశా), షంషీర్‌ సింగ్‌డుల్లో(పంజాబ్‌), నజీర్‌ అహ్మద్‌ లవాయ్‌(జమ్మూ-కాశ్మీర్‌) ఈ పర్యటనలో పాల్గొన్నారు. వీరితో పాటు  రాజంపేట, చిత్తూరు ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప పాల్గొన్నారు. ముందుగా కమిటీ బృందం చిన్నగొట్టిగల్లులో ఉపాధిహామీ పథకం నిధులతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని  తనిఖీ చేశారు. ఈ సర్వీసెస్‌, పాత పంచాయతీ కార్యాలయాలకు, ఇప్పటి సచివాలయాలకు గల తేడాలు, సౌకర్యాలపై ఎంపీడీవో వెంకటనారాయణ వారికి వివరించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షిత్‌రెడ్డి కమిటీ సభ్యులను కలిసి సత్కరించారు. అనంతరం కల్లూరు ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో స్వయం సహాయక సంఘాల మహిళలతో కమిటీ బృందం ముఖాముఖి చర్చ నిర్వహించింది.  చైర్మన్‌ జాదవ్‌ మాట్లాడుతూ గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ ముందున్నారని చెప్పారు. సంఘం ద్వారా అందిస్తున్న నిధులతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని లబ్ధిదారు రెడ్డెమ్మ కమిటీ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ పథకాల గురించి అనర్గళంగా ప్రసంగించిన విద్యార్థిని భవ్య మాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. బృంద సభ్యుడు నజీర్‌ అహ్మద్‌ లవాయ్‌ మాట్లాడుతూ సచివాలయ, వలంటరీ వ్యవస్థ బాగుందని కితాబిచ్చారు.  ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ  పథకాలన్నింటినీ వారి పేరు మీదనే అందిస్తున్నట్లు చెప్పారు. మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. అంతకు ముందు కమిటీ సభ్యులు పులిచెర్ల మండలంలోని దిగువపొకలవారిపల్లెకు చేరుకుని అక్కడ వాటర్‌షెడ్‌ నిధులతో చేపట్టిన చెక్‌ డ్యాం నిర్మాణానికి అయిన వ్యయం, భూగర్భ జలాల పెంపు, సాగు విస్తీర్ణం తదితర అంశాలపై ఆరా తీశారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు అక్కడి నుంచి సువారపువారిపల్లెకు చేరుకొని ఉపాధి హామీ పథకంలో చేపట్టిన మామిడి తోటల పెంపకాన్ని పరిశీలించారు. సాగు ఖర్చు, మార్కెటింగ్‌ సౌకర్యం తదితరాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మతుకువారిపల్లెలో ఉపాధి నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను పరిశీలించారు. రైతుభరోసా కేంద్రంలో రైతులకు అందిస్తున్న 16రకాల సేవలైన పీఎం కిసాన్‌- వైఎస్సార్‌ రైతు భరోసా, ఇ-క్రాప్‌ బుకింగ్‌, డి-కృషి(సీడ్‌ డిస్ర్టిబ్యూషన్‌), సీఎం యాప్‌, వైఎస్సార్‌ యాప్‌, నాణ్యమైన విత్తనాల పంపిణీ, పొలంబడి, క్రాప్‌ ఇన్సూరెన్స్‌, జేఎల్‌జీ గ్రూపుల గురించి ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప వివరించారు. రైతులకు అందిస్తున్న సేవల గురించి జేడీ విజయ్‌కుమార్‌ వివరించారు.  అక్కడనుంచి కల్లూరులో ఎస్‌డబ్ల్యూపీసీ కింద నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. సేకరించిన, చెత్తను ఎరువుగా తయారు చేసే విధానాన్ని కో-ఆర్డినేటర్‌ ఐఆర్‌ షణ్ముగం వివరించారు. ఈ పర్యటనలో పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు, ఆసరా, సంక్షేమం జేసీ రాజశేఖర్‌, ఉపాధి డైరెక్టర్‌ చిన్న తాతయ్య, సభ్యులు విశ్వనాథ్‌, డ్వామా పీడీ చంద్రశేఖర్‌, డీఆర్‌వో మురళి, హౌసింగ్‌ పీడీ పద్మనాభం, పీఆర్‌ ఎస్‌ఈ అమరనాథ రెడ్డి, డీపీవో దశరథరామిరెడ్డి, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌డీవో కనకనరసా రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ తులసి, ఏపీడీ ప్రభావతి,ధనంజయరెడ్డి, మునిరత్నం,  ఇండియన్‌ బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ ఏకే మహాపాత్ర, యూనియన్‌ జీఎం లాల్సింగ్‌, ఎల్‌డీఎం గణపతి, ఎంపీడీవో దేవేంద్రబాబు, తహసీల్దారు విజయసింహారెడ్డి, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు సహదేవరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-17T06:00:32+05:30 IST