గవర్నర్ జోక్యం చేసుకోవాలి: బొప్పరాజు
ABN , First Publish Date - 2021-01-22T09:24:28+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపివేసేందుకు గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని, తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించాలని ఏపీ అమరావతి ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపివేసేందుకు గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని, తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించాలని ఏపీ అమరావతి ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఉద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడారు. ప్రతి ఉద్యోగికి కరోనా వ్యాక్సిన్ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ టీకా ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదన్నారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర ఎన్నికల సంఘం లక్ష్య పెట్టడం లేదన్నారు. ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పుపై ఉద్యోగుల తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి అన్నారు.