యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గ్రౌండ్ను ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2022-05-25T05:40:37+05:30 IST
పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే యువతకు కాలేజ్ గ్రౌండ్ను సిద్ధం చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన దోమకొండ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ను తనిఖీ చేశారు.
దోమకొండ, మే 24: పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే యువతకు కాలేజ్ గ్రౌండ్ను సిద్ధం చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన దోమకొండ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ను తనిఖీ చేశారు. అనంతరం కాలేజీ గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పోలీసు ఉద్యోగాల కోసం గ్రౌండ్లో రన్నింగ్ గ్రౌండ్తో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని సర్పంచ్ నల్లపు అంజలికి సూచించారు. సంగమేశ్వర్ గ్రామంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మొరంతో చదును చేసేందుకు నిధులు మంజూరు చేయాలని విండో చైర్మన్ నాగరాజ్రెడ్డి, వైస్ ఎంపీపీ బాపురెడ్డిలు కలెక్టర్ను కోరగా వెంటనే తన ఫండ్స్ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేశారు. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు గ్రౌండ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తీగల తిర్మల్గౌడ్, ఎంపీపీ కానుగంటి శారద, జిల్లా ఆసుపత్రులు సమన్వయకర్త విజయలక్ష్మీ, ఎంపీడీవో చిన్నారెడ్డి, వైద్యాధికారి సంగీత్ కూమార్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసవాలు జరిగేలా చూడాలి
బీబీపేట, మే 24: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మంగళవారం పరిశీలించారు. పీహెచ్సీలోని రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా గర్భిణులను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. రోగుల పట్ల మర్యాదగా మెలగాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని అన్నారు. అలాగే ఎస్సీ హాస్టల్ను సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో చంద్రశేఖర్, ఎంపీడీవో నారాయణ, ఎంపీవో కృష్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ తేలు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీని అమలు చేయాలి
కామారెడ్డి టౌన్ : అన్ని పీహెచ్సీలలో ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలుచేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం ఆరోగ్యశ్రీ అమలుపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. వారం రోజులకు ఒకసారి ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రససవాలు 100 శాతం అయ్యేలా చూడాలని కోరారు. వైద్యులు సమయపాలన పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్, వైద్యాధికారి నితిన్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వోలు తదితరులు పాల్గొన్నారు.
దేవాగౌడ్కు అభినందన
మాచారెడ్డి : మండలంలోని ఫరీద్పేట్కు చెందిన కర్రోల్ల దేవాగౌడ్ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అభినందించారు. మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్లో మల్టీ టాలెంటెడ్ పర్సన్గా దేవాగౌడ్ పేరు నమోదు అయి అరుదైన రికార్డు సాధించినందుకు గాను కలెక్టర్ అభినందించినట్లు దేవాగౌడ్ తెలిపారు.