Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైళ్లలో జర్నీ చేసే ప్రయాణికులకు ఈ విషయం తెలుసో.. లేదో..!
ABN , First Publish Date - 2022-10-04T17:59:56+05:30 IST
కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా నగరవాసులకు కాగిత రహిత ప్రయాణాన్ని అందించేందుకు..
మెట్రో స్టేషన్లలో వాట్సాప్ టికెట్
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా నగరవాసులకు కాగిత రహిత ప్రయాణాన్ని అందించేందుకు హైదరాబాద్ మెట్రో, ఎల్అండ్టీ సంస్థలు తొలిసారిగా ఈ-టికెటింగ్ను ప్రారంభించాయి. ఈ- టికెటింగ్పై కొన్ని నెలలుగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు మెట్రోస్టేషన్లలో వాట్సాప్ టికెటింగ్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు ప్రవేశద్వారం వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎక్కడికి వెళ్లాలో ఎంటర్ చేసి యూపీఏ ద్వారా డబ్బులు చెల్లించొచ్చు. రైలు దిగిన తర్వాత వాట్సాప్లో వచ్చిన టికెట్ను స్కాన్ చేస్తే గేటు తెరుచుకుంటుంది.
ఈ సందర్భంగా ఎల్అండ్టీ ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్ట మొదటిసారిగా వాట్సప్ టికెటింగ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. బిల్ఈజీ ఫౌండర్, ఎండీ ఆకాష్ దిలీప్ పాటిల్ మాట్లాడుతూ కనెక్టెడ్ ఫ్యూచర్ కోసం డిజిటల్ అనుభవాలను అందించేందుకు తమ బృందం కట్టుబడి ఉందన్నారు. దేశంలో రవాణా వ్యవస్థను డిజిటలైజేషన్ చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. వాట్సాప్ ద్వారా ఆన్లైన్ టికెటింగ్ను హెచ్ఎంఆర్, బిల్ఈజీలు సాధ్యం చేశాయని తెలిపారు.