ఈ-నామ్ విధానం అమలు అభినందనీయం
ABN , First Publish Date - 2022-07-02T06:21:01+05:30 IST
దేశంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రముఖ స్థానంలో నిలుస్తోందని.. అధికారులు, సిబ్బంది, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, రైతుల సమన్వయంతో ఇక్కడ ఈ-నామ్ విధానాన్ని అమలు చేయడం అభినందనీయమని సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర వ్యవసాయ శాఖ రైతు సంక్షేమ విభాగం సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మీ అన్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ రైతు సంక్షేమ విభాగం సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మీ
నగరంలోని వ్యవసాయ మార్కెట్యార్డ్ పరిశీలన
ఖిల్లా, జూలై 1: దేశంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రముఖ స్థానంలో నిలుస్తోందని.. అధికారులు, సిబ్బంది, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, రైతుల సమన్వయంతో ఇక్కడ ఈ-నామ్ విధానాన్ని అమలు చేయడం అభినందనీయమని సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర వ్యవసాయ శాఖ రైతు సంక్షేమ విభాగం సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మీ అన్నారు. శుక్రవారం ఆమెతో పాటు కేంద్ర బృందం సభ్యులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ-నామ్ అమలు విధానాన్ని పరిశీలించారు. యార్డ్లో రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. అనంతరం విజయలక్ష్మీ మాట్లాడుతూ.. నిజామాబాద్ మార్కెట్యార్డ్ను సందర్శించడం గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు. ఇక్కడికి రావడం వల్ల చాలా విషయాలు తెలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ఇక్కడి వసతులు, ఈ-నామ్ విధానం అమలు తీరు తెలుసుకొని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తామని తెలిపారు. యార్డ్లో రైతులకు మెరుగైన వసతులు కల్పించడానికి తమ వంతుగా కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ జి.లక్ష్మీబాయి అన్నారు. రైతులకు సదుపాయాలు పెంచడానికి యార్డ్లో మరిన్ని షెడ్లను నిర్మిస్తామని తెలిపారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్కు రావడం ఆనందంగా ఉందని, చాల విషయాలను తెలుసుకోవడం జరిగిందని, చాల విషయాలు నేర్చుకోవడం గొప్ప అనుభూతిని కలిగిందని కర్నాటక, బిహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మార్కెటింగ్ శాఖ అదనపు డెరెక్టర్ లక్ష్మణుడు, ఇఫ్తెఖార్ అహ్మద్, మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లాభిశెట్టి శ్రీనివాస్, కమాల్కిషోర్ఇనాని, మాస్టర్ శంకర్, సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి వెంకటేశం, కార్యదర్శి విజయ్కిషోర్, నాగార్జున సంస్థ టెక్నికల్ సిబ్బంది, రైతులు రాజరెడ్డి పాల్గొన్నారు.
రైతు వేదికను పరిశీలించిన ఐఏఎస్ అధికారుల బృందం..
డిచ్పల్లి: వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ, ఫార్మర్ వెల్పేర్ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో మండలంలోని నడిపల్లి క్లస్టర్ రైతు వేదికను శుక్రవారం ఐఏఎస్ అధికారుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్ ఏడీఏ ప్రదీప్ కుమార్ అధికారులకు రైతు వేదికల ప్రాముఖ్యత, రైతులకు ఇస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను వివరించారు. అనంతరం రైతు వేదిక వద్ద అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఐఏఎస్ల బృందం సభ్యులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల వ్యవసా యాధికారి రాంబాబు, విస్తీర్ణాధికారులు భావన, అశ్రిత, సంధ్యరేఖ, వంశీ కృష్ణ, రుపేశ్ కుమార్ పాల్గొన్నారు.