చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం
ABN , First Publish Date - 2022-07-07T07:39:56+05:30 IST
మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామీణ బ్యాంకు దొంగతనం కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నలుగురు సీఐల ఆధ్వర్యంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. బ్యాంకులో దొరికిన కొన్ని వస్తువుల ఆధారంగా ఆయా రాష్ట్రాలకు బృందాలను పంపించారు.
ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పోలీసు బృందాలు
అత్యాధునిక సాఫ్ట్వేర్ వినియోగం
నలుగురు సీఐల ఆధ్వర్యంలో దర్యాప్తు
నిజామాబాద్, జూలై 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామీణ బ్యాంకు దొంగతనం కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నలుగురు సీఐల ఆధ్వర్యంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. బ్యాంకులో దొరికిన కొన్ని వస్తువుల ఆధారంగా ఆయా రాష్ట్రాలకు బృందాలను పంపించారు. దొంగలు వదలిన ఆనవాల్లతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన దొంగతనాల నమూనాను బట్టి మూడు రాష్ట్రాలపై నిఘాపెట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర దొంగల ముఠాపైనే దృష్టిపెట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దొంగతనం జరిగిన సమయంలో బుస్సాపూర్, ఆ పరిధిలో జాతీ య రహదారి వెంట ఉపయోగించిన సెల్ల వివరా లు కూడా పరిశీలిస్తున్నారు. టోల్గేట్లు, ప్రధాన రహదారి వెంట ఉన్న సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. నేరం జరిగిన ప్రాంతాల్లో ఫుటేజ్ లేకపోవడంతో క్లూస్ టీమ్ ఇచ్చిన వేలిముద్ర లు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. అ త్యాధునిక సాఫ్ట్వేర్ ఉపయోగించి గతం లో ఇలాంటి దొంగతనాలకు పాల్పడిన వారు ఎవరైనా ఈ దొంగతనం చేశారా పరిశీలిస్తున్నారు. ఫింగర్ ప్రింట్లు, ఇతర వివరాల ఆధారంగా ముందుకుపోతున్నారు. దొంగతనం జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో సెల్ వాడకం కూడా ఆ సమయంలో తక్కువగా ఉం డడం, కొంతమంది సెల్వాడడం వల్ల వాటిని కూడా పరిశీలిస్తున్నారు. చుట్టూ ప్రధాన రహదారి వెంట పది కిలో మీటర్ల లోపు హిందీ, మరాఠీతో పాటు ఇతర భాషలు మాట్లాడిన సెల్ఫోన్ల వివరాలు తీసుకుంటున్నారు. ఒక్కో బృందానికి సీఐలు ఇన్చార్జిగా నియమించి ఎస్ఐ, కానిస్టేబుల్లను అదనంగా ఉంచారు. జిల్లాలో జరిగిన ఈ సంఘటన త్వరగా తేల్చేందుకు పోలీసు కమిషనర్ నాగరాజు ప్రత్యేకంగా సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు బృందాలకు సూచనలు చేస్తున్నారు.
మఫ్లర్, మంకీమాస్కు వదిలివెళ్లిన దుండగులు
బ్యాంక్లో గ్యాస్కట్టర్తో గ్రిల్స్ తొలగిస్తుండగా మంటలు రావడంతో దుండగులు మఫ్లర్, మంకీమాస్కును అక్కడే వదిలివెళ్లారు. మంకీ మాస్కును హైదరాబాద్ ముసాపేట్లోని ఓ షాపులో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. షాపులోని సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
డిపాజిట్దారుల ఆందోళన..
బ్యాంకులో భారీగా దొంగతనాలు జరగడంతో డిపాజిట్దారులు, డబ్బులు దాచుకున్నవారు ఆందోళనలకు గురికావడంతో పాటు బంగారాన్ని తీసుకెళ్లారు. బ్యాంకు అధికారులు కూడా నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. సీసీ కెమెరాలతో పాటు అలారమ్ చెడిపోవడంతో వాటిని బాగుచేయడంతో పాటు బ్యాంకుకు కావాల్సిన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. దొంగతనం జరిగిన సమయంలో అలారమ్ మోగకపోవడం, ఇతర సాంకేతిక అంశాలలో లోపం ఉండడం, దర్యాప్తులో పోలీసులు గమనించారు. బ్యాంకు అధికారులకు సూచన చేశారు.