పిల్లలు వదిలేసిన తండ్రిని ఓల్డేజ్ హోంలో చేర్పించిన జడ్జి
ABN , First Publish Date - 2022-01-22T05:21:05+05:30 IST
కన్నతండ్రి అనారోగ్యానికి గురైనా కనికరించని ఆ కొడుకు, కూతుళ్లు అతడిని అక్కున చేర్చుకునే బదులు అనాథగా వదలివెళ్లారు.
జహీరాబాద్ జనవరి 21: కన్నతండ్రి అనారోగ్యానికి గురైనా కనికరించని ఆ కొడుకు, కూతుళ్లు అతడిని అక్కున చేర్చుకునే బదులు అనాథగా వదలివెళ్లారు. సభ్య సమాజం తలదించుకునేలా ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామస్థులను కలచివేసింది. ఈ విషయాన్ని గమనించిన సర్పంచ్ అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సమాచారం తెలుసుకున్న జహీరాబాద్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి దుర్గాప్రసాద్ అనాథగా మారిన ఆ తండ్రిని పరామర్శించారు. సికింద్రాబాద్లోని గుడ్ సమారిటన్ ఇండియా అనే ఓల్డేజ్ హోంలో చేర్పించి మానవత్వాన్ని చాటారు. ఏపీలోని పిఠాపురానికి చెందిన గురుప్రసాద్(75) కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్లో స్థిరపడి రికార్డింగ్ స్టూడియో నిర్వహిస్తూ జీవనాన్ని కొనసాగించారు. అతడికి ఓ కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నట్లు సమాచారం. అయితే కొన్ని నెలల క్రితం గురుప్రసాద్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఈ నెల 16న ఉదయం 5 గంటలకు కొడుకు, కూతుళ్లు కలిసి గురుప్రసాద్ను సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో వదిలేసి ఎవరి కంటా పడకుండా అక్కడి నుంచి జారుకున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిని గమనించిన సర్పంచ్ చలించిపోయి, స్థానిక పోలీసులకు, జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి సమాచారాన్ని అందించారు. దీంతో ఝరాసంగం పోలీసులు, జహీరాబాద్ 108 సిబ్బందితో కలిసి జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ గురుప్రసాద్ చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న జహీరాబాద్ కోర్టు సీనియర్ సివిల్జడ్జి దుర్గాప్రసాద్ ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా గురుప్రసాద్ కన్న కూతురికి జడ్జి పలుమార్లు ఫోన్ చేసినా జవాబు రాలేదు. చివరికి జహీరాబాద్ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్, ఆసుపత్రి సూపరింటెండెంట్ శేషు సహకారంతో గురుప్రసాద్ను సికింద్రాబాద్లోని గుడ్ సమారిటన్ ఇండియా అనే ఓల్డేజ్ హోంలో చేర్పించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. అవసానదశలో ఉన్న తండ్రిని కన్నబిడ్డలు నిర్ధాక్షిణ్యంగా వదిలి వేయడం మానవత్వానికే కళంకమని ఆవేదన వ్యక్తం చేశారు.