ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లగేజీ వ్యాను

ABN , First Publish Date - 2022-05-22T06:42:01+05:30 IST

ఇందిరమ్మ కాలనీ వద్ద ద్విచక్ర వాహనాన్ని లగేజీ వ్యాను ఢీకొంది.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లగేజీ వ్యాను
రాజశేఖర్‌రెడ్డి (ఫైల్‌ఫొటో), శేఖర్‌రెడ్డి

ఓ యువకుడి దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం


చంద్రగిరి, మే 21: చంద్రగిరి పంచాయతీ పరిధిలోని అనుప్పల్లె-చంద్రగిరి మార్గంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ద్విచక్ర వాహనాన్ని లగేజీ వ్యాను ఢీకొంది. ఈప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రగిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామచంద్రాపురం మండలం ఉప్పిలివంక గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంరెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి(24) అదే గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి కుమారుడు శేఖర్‌రెడ్డిలు చంద్రగిరి నుంచి స్వగ్రామమైన ఉప్పిలివంకకు ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. ఇందిరమ్మ కాలనీ వద్దకొచ్చేసరికి దోర్నకంబాల నుంచి చంద్రగిరికి వస్తున్న లగేజీ ఆటో ఢీకొంది. ఈప్రమాదంలో  రాజశేఖర్‌రెడ్డి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. శేఖర్‌రెడ్డికి కాలు విరిగి తీవ్ర రక్తస్రావం అయింది. స్థానికులు శేఖర్‌రెడ్డిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం స్విమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-22T06:42:01+05:30 IST