కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన మేయర్
ABN , First Publish Date - 2021-05-09T05:12:00+05:30 IST
జీవీఎంసీ 16వ వార్డులోని హెచ్బీకాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జీవీఎంసీ సీఎంవోహెచ్ డాక్టర్ కేఎస్ఎల్జీ శాస్త్రి, ఇతర అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
వెంకోజీపాలెం, మే 8: జీవీఎంసీ 16వ వార్డులోని హెచ్బీకాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జీవీఎంసీ సీఎంవోహెచ్ డాక్టర్ కేఎస్ఎల్జీ శాస్త్రి, ఇతర అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి తోడు 15వ వార్డు కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేయర్ స్పందించి ఈ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ యూపీహెచ్సీలో మూడు వందల డోసులు సరఫరా చేస్తున్నట్టు డాక్టర్ జీవన్రాణి తెలియపరచడంతో వాటిపై మేయర్ ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. నగర ప్రజలంతా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కాగా ఆరోగ్య కేంద్రం దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ పలువురు మేయర్కు ఫిర్యాదు చేశారు. అంతేకాక వ్యాక్సిన్ వేయ డంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మేయర్ సిబ్బందితో సమావేశమై వ్యాక్సినేషన్లో అవకతవకలు జరిగితే సహించేది లేదని, ప్రజలతో సిబ్బంది సక్రమంగా నడుచుకోవాలని హెచ్చరించారు. కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య అభ్యర్థన మేరకు పక్కనే ఉన్న జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో 15, 16 వార్డులకు విడివిడిగా వ్యాక్సిన్లు వేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు హరి వెంకటకుమారి సూచించారు. కార్యక్రమంలో 16వ వార్డు కార్పొరేటర్ మొల్లి లక్ష్మి, వైసీపీ నాయకుడు మొల్లి అప్పారావు, టీడీపీ నాయకుడు అప్పారి గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.