సర్పంచ్ల విధులు, నిధుల కోసం ఉద్యమం ఉధృతం
ABN , First Publish Date - 2022-10-03T06:31:02+05:30 IST
రాష్ట్రంలో పంచాయతీ సర్పంచ్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎస్.రాయవరం మాజీ ఎంపీపీ యేజర్ల వినోద్రాజు స్పష్టం చేశారు.
- ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ‘యేజెర్ల ’ వినోద్రాజు
ఎస్.రాయవరం, అక్టోబరు 2 : రాష్ట్రంలో పంచాయతీ సర్పంచ్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎస్.రాయవరం మాజీ ఎంపీపీ యేజర్ల వినోద్రాజు స్పష్టం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం మండలంలోని అడ్డురోడ్డులో వినోద్రాజు ఆధ్వర్యంలో పలువురు సర్పంచ్లు తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గాంధీ విగ్రహానికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం కేటాయిస్తున్న గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తుండడం దారుణమన్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి పంచాయతీలు, సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు అమలకంటి అబద్దం, మాజీ అధ్యక్షుడు నల్లపరాజు వెంకటరాజు, అల్లు నర్సింహమూర్తితో పాటు సర్పంచ్లు కొచ్చర్ల నాగరత్నం, అల్లు వెంకటప్రశాంతి, పోలిశెట్టి సుభాషిణి, తన్నీరు గంగాలక్ష్మి, రాలి వెంకటరమణ, వజ్రపు కుమార్, దండు గోపీరాజు, కలిగట్ల రత్నం తదితరులు పాల్గొన్నారు.