మా నాన్న పోలీస్.. అంతా నేను చూసుకుంటాను అంటూ ఆ యువకుడు ఎంత ఘోరానికి పాల్పడ్డాడంటే..
ABN , First Publish Date - 2021-12-31T16:48:29+05:30 IST
ఆ యువకుడు కానిస్టేబుల్ కొడుకు.. కాలేజీలో స్నేహితులతో కలిసి జల్సాగా తిరిగేవాడు..
ఆ యువకుడు కానిస్టేబుల్ కొడుకు.. కాలేజీలో స్నేహితులతో కలిసి జల్సాగా తిరిగేవాడు.. ప్రేమ అంటూ ఓ యువతి వెంట పడేవాడు.. ఆమె తన ప్రేమను నిరాకరించడంతో పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.. ఆమెను కిడ్నాప్ చేసి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు.. అనంతరం ఆమెను చంపేశాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ ఘటన జరిగింది.
కాన్పూర్లోని ఓ కాలేజీలో ఎమ్మెస్సీ చదువుతున్న సోమనాథ్ గౌతమ్ అనే యువకుడు తన క్లాస్మేట్ను ప్రేమించాడు. ప్రేమ అంటూ ఆ యువతి వెంట పడేవాడు. అయితే ఆ యువతి మరో యువకుడితో సన్నిహితంగా మెలిగేది. ఆ యువతి తనను తిరస్కరించడాన్ని జీర్ణించుకోలేకపోయిన సోమనాథ్ ఆమెపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. స్నేహితులు సత్యం, రవీంద్ర సహాయంతో మంగళవారం సాయంత్రం ఆమెను కిడ్నాప్ చేశాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ముగ్గురూ ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేశారు.
అనంతరం ఆ మృతదేహాన్ని ఓ బ్రిడ్జి కింద పడేశారు. ఆ మృతదేహం గురించి బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో సోమనాథ్ పేరు తెరపైకి వచ్చింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. సత్యం, రవీంద్రను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. `మా నాన్న పోలీస్ కానిస్టేబుల్, ఏమైనా జరిగితే నేను చూసుకుంటాన`ని సోమనాథ్ చెప్పడంతోనే తాము ఆ హత్యలో పాలుపంచుకున్నామని సత్యం, రవీంద్ర చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు.