మసీదు పేరు నిర్ణయించలేదు: ఐఐసీఎఫ్
ABN , First Publish Date - 2020-08-09T09:08:12+05:30 IST
అయోధ్యలోని మసీదులో నిర్మించనున్న వివిధ భవనాలకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఆహ్వానించనున్నామని ఇండో ఇస్లామిక్ కల్చరల్
లఖ్నవూ, ఆగస్టు 8: అయోధ్యలోని మసీదులో నిర్మించనున్న వివిధ భవనాలకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఆహ్వానించనున్నామని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ కార్యదర్శి అథర్ హుస్సేన్ తెలిపారు. మసీదు ప్రాంగణంలో ఓ ఆస్పత్రి, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్తోపాటు పరిశోధన కేంద్రాన్ని నిర్మించనున్నామని, వీటికి శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రిని పిలుస్తామని వివరించారు. సీఎం యోగి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా వాటికి సహకారం అందిస్తారని చెప్పారు. ఇస్లాం సంప్రదాయాల ప్రకారం మసీదుకు శంకుస్థాపన ఉండదని చెప్పారు. ఇక్కడ నిర్మించబోయే మసీదుకు ‘బాబ్రీ మసీదు’గానే నామకరణం చేస్తారా? అన్న ప్రశ్నకు.. ఇంకా నిర్ణయించలేదన్నారు. మదీనా సహా మరికొన్ని మసీదులు మినహా పేర్లకు పెద్దగా పట్టింపు లేదని, ‘సజ్దా’ను మసీదులో చేయడమే ముఖ్యమని, మిగిలినదంతా అర్ధరహితమని వ్యాఖ్యానించారు.