నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి
ABN , First Publish Date - 2021-04-18T05:47:47+05:30 IST
నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం డిమాండ్ చేశారు.
-తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం
సుభాష్నగర్, ఏప్రిల్17: నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని రెవెన్యూ గార్డెన్లో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం, జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 15 నుంచి 22 శాతం, ఎస్టీలకు 7 నుంచి 12 శాతం, బీసీలకు 55 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా నూతన క్యావర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు సముద్రా అజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ గజ్జెల ఆనందరావు, టీపీఎస్జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుద్దాల లక్ష్మణ్, సొల్లు అజయ్వర్మ, రాష్ట్ర కార్యదర్శులు మీసాల సాయి, బత్తుల పాండు, రాష్ట్ర అధికార ప్రతినిధి కోండ్ర సంపత్, మైస సాంబన్న, మాజీ జడ్పీటీసీ కోండ్ర స్వరూప, గోష్కి శంకర్, బుచ్చి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.