Jharkhand: ఎమ్మెల్యేలను కొనడం, అమ్మడం బీజేపీ పని: సీఎం
ABN , First Publish Date - 2022-08-30T22:58:55+05:30 IST
జార్ఖాండ్లో తలెత్తిన రాజకీయ అలజడిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్..
రాంచీ: జార్ఖాండ్లో తలెత్తిన రాజకీయ అలజడిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ (Hemant Soren) మంగళవారంనాడు ఘాటుగా స్పందించారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాజకీయ బేరసారాలకు ఆ పార్టీ పాల్పడుతోందని అన్నారు. ''వాళ్లు కేవలం ఎమ్మెల్యేను కొంటారు, అమ్మేస్తారు. మేము మాత్రం ప్రజల కోసం పనిచేస్తాం. బేరసారాలకు పాల్పడం. రాజకీయాల్లో వ్యాపారం చేసే వ్యక్తులకు ప్రజలే గట్టి సమాధానం చెబుతారు'' అని ఆయన అన్నారు.
సీఎం పదవి గురించి తనకు బాధలేదని, ప్రజల కోసమే తన బాధ అని సోరెన్ అన్నారు. ''సీఎం సీటు కోసం నాకు ఎలాంటి బాధా లేదు. నా బాధ అంతా దళితులు, ఆదివాసీలు, రాష్ట్ర ప్రజల కోసమే'' అని సోరెన్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. తాను గిరిజన కమ్యూనిటీ నుంచి వచ్చానని, ప్రస్తుత ఆటుపోట్లు లెక్కచేయనని అన్నారు. కాగా, 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలోని అధికార కూటమిలో జేఎంఎంకు 30 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. 2021లో గనుల మంత్రిగా ఉన్న సోరెన్ ఒక గనికి తన కోసం కేటాయించుకున్నారని, అధికార దుర్వినియోగం కింద ఆయనపై అనర్హత వేటు వేయాలని గవర్నర్కు బీజేపీ ఇటీవల ఫిర్యాదు చేంది. దీనిపై గవర్నర్ ఈసీని సంప్రదించగా, ఈసీ సమర్ధించింది. దీంతో ఏ క్షణంలోనైనా సోరెన్పై అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వెడెక్కాయి.