సచివాలయాలను ఖాళీ చేయించిన ఇంటి యజమాని

ABN , First Publish Date - 2022-09-30T06:02:45+05:30 IST

కర్నూలు రూరల్‌ మండలం ఉల్చాల గ్రామంలో అద్దె ఇంట్లో కొనసాగుతున్న సచివాలయ కార్యాలయం-1, సచివాలయ కార్యాలయం-2ను ఆ ఇంటి యాజమాని గురవారం ఖాళీ చేయించారు.

సచివాలయాలను ఖాళీ చేయించిన ఇంటి యజమాని
సచివాలయ సామగ్రిని తీసుకెళ్తున్న పంచాయతీ కార్యదర్శి

కర్నూలు(రూరల్‌), సెప్టెంబరు 29: కర్నూలు రూరల్‌ మండలం ఉల్చాల గ్రామంలో అద్దె ఇంట్లో కొనసాగుతున్న సచివాలయ కార్యాలయం-1, సచివాలయ కార్యాలయం-2ను ఆ ఇంటి యాజమాని గురవారం ఖాళీ చేయించారు. గ్రామంలో మూడేళ్ల నుంచి సచివాలయ భవనాలు లేకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు గ్రామంలోని ఓ ప్రైవేటు వ్యక్తి ఇంటిని అద్దెకు తీసుకుని ఈ రెండు కార్యాలయాలను కొనసాగిస్తున్నారు. కాగా ఆ ఇంటి యాజమాని నూతనంగా నిర్మించుకున్నారు. అందులో బండపరుపు లేకపోయినా, అక్కడక్కడ కొంత మైనర్‌ వర్క్‌ ఉన్నప్పటికీ అధికారులు ఈ కార్యలయాలను ఏర్పాటు చేసి అందులోనే పాలన కొనసాగించారు. అయితే కొంతకాలంగా సంబంధిత ఇంటి యాజమాని సచివాలయ కార్యాలయాలను ఖాళీ చేయాలని, తాను ఆ ఇంట్లో చేరబోతున్నట్లు అధికారులకు తెలియజేస్తూ వచ్చారు. అయినా అధికారులు ఇంటి యాజమాని మాటలను పట్టించుకోకుండా, గ్రామంలో మరో అద్దె భవనాన్ని చూసుకోక అందులోనే కార్యాలయాలను కొనసాగిస్తూ వచ్చారు. దీంతో సంబంధిత ఇంటి యాజమాని గురువారం కార్యాలయాల్లోని ఫర్నీచర్‌తో సహా, ఇతర సామగ్రిని ఇంటి బయట ఓమూలన పెట్టేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శితో పాటు సచివాలయ సిబ్బంది కలిసి రెండు సచివాలయాలకు చెందిన ఫర్నీచర్‌, ఇతర సామగ్రిని గ్రామంలోని  రైతు భరోసా కేంద్రంలోకి తరలించారు. సచివాలయ భవనం తయారు అయ్యేంతవరకు రైతు భరోసా కేంద్రం నుంచి పాలన కొనసాగిస్తామని ఈవోఆర్డీ నాగేశ్వరరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-09-30T06:02:45+05:30 IST