‘పాలవెల్లువ’ లక్ష్యం సాధించాలి
ABN , First Publish Date - 2021-02-26T05:16:27+05:30 IST
జిల్లాలో జగనన్న పాలవెల్లువ పథకం లక్ష్య సాధనకు కృషి చేయాలని కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్లో గురువారం ‘ఏపీ అమూల్ ప్రాజెక్టు జగనన్న పాల వెల్లువ’పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొదటివిడతగా లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, గార, నరసన్నపేట, శ్రీకాకుళం మండలాల పరిధిలోని 139 గ్రామాల్లో పాలవెల్లువను అమలు చేయనున్నట్లు తెలిపారు.
- మొదటి విడత 139 గ్రామాల్లో అమలు
- పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి
- కలెక్టర్ నివాస్
కలెక్టరేట్/గుజరాతీపేట, ఫిబ్రవరి 25: జిల్లాలో జగనన్న పాలవెల్లువ పథకం లక్ష్య సాధనకు కృషి చేయాలని కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్లో గురువారం ‘ఏపీ అమూల్ ప్రాజెక్టు జగనన్న పాల వెల్లువ’పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొదటివిడతగా లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, గార, నరసన్నపేట, శ్రీకాకుళం మండలాల పరిధిలోని 139 గ్రామాల్లో పాలవెల్లువను అమలు చేయనున్నట్లు తెలిపారు. ‘తహసీల్దార్, ఆర్ఐలు, పశువైద్యులు, ప్రత్యేక అధికా రులు సంయుక్తంగా గ్రామాలకు దగ్గరలోనే పాల శీతలీకరణ కేంద్రాలను గుర్తించాలి. ఈ కేంద్రాలను ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మించాలి. విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలి. పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రయోజనాలను వివరించాలి. ఆరోగ్యవంతమైన ఆవులు, గేదెలను మాత్రమే కొనుగోలు చేసి వాటికి బీమా ట్యాగ్లు వేయాలి. వైఎస్ఆర్ చేయూత పథకానికి 45 నుంచి 60 ఏళ్ల లోపు బీసీ, ఎస్సీ, మైనారిటీలు, వితంతువులు అర్హులు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి. అమూల్ సంస్థ పాలను కొనుగోలు చేస్తుంది. దీనివల్ల లబ్ధిదారులు సుమారు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు అదనంగా ఆదాయం పొందుతారు’ అని కలెక్టర్ తెలిపారు. జేసీ సుమిత్కుమార్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ చేయూత దరఖాస్తులను బ్యాంకులకు మార్చి 5 లోగా గ్రౌండ్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఆర్.శ్రీరాములునాయుడు, డీఆర్డీఏ పీడీ బి.శాంత్రిశ్రీ పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్ పాల్గొన్నారు.