పిడుగుల కాలం.. జరభద్రం...!
ABN , First Publish Date - 2022-09-23T05:29:28+05:30 IST
పిడుగుల కారణంగా ఏడాదికి సుమారు 24వేల మంది మృత్యువాత పడుతున్నట్లు ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల వర్షాలతో పాటు పలు చోట్ల పిడుగులు పడడంతో అటు రైతులు, ఇటు సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలీలు, రైతులు, పశువుల కాపర్లు పిడుగుపాటుకు గురవుతున్నారు. చెట్ల కింద కట్టేసిన పశువులు సైతం పిడుగుపాటుతో ప్రమాదానికి గురై మరణిస్తున్నాయి.
- జిల్లాలో పలుచోట్ల పిడుగు ప్రమాదాలు
- నిజాంసాగర్లో ఓ రైతు మృత్యువాత, మరో ఇద్దరికి గాయాలు
- గత కొన్ని నెలల కిందట కామారెడ్డి మండలంలో ఓ మహిళ కూలీ, క్యాసంపల్లిలో ముగ్గురు మృత్యువాత
- పిడుగులు పడే సమయంలో ఎత్తైన భవనాలు, చెట్ల కిందకు వెళ్లకపోవడమే నయం
- జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు
కామారెడ్డి టౌన్, సెప్టెంబరు 22: పిడుగుల కారణంగా ఏడాదికి సుమారు 24వేల మంది మృత్యువాత పడుతున్నట్లు ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల వర్షాలతో పాటు పలు చోట్ల పిడుగులు పడడంతో అటు రైతులు, ఇటు సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలీలు, రైతులు, పశువుల కాపర్లు పిడుగుపాటుకు గురవుతున్నారు. చెట్ల కింద కట్టేసిన పశువులు సైతం పిడుగుపాటుతో ప్రమాదానికి గురై మరణిస్తున్నాయి. పిడుగుల కాలం కావడంతో ప్రజలు భద్రంగా ఉండాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. గురువారం నిజాంసాగర్ మండలంలో ఓ రైతు పంట పొలాల్లో పని చేస్తూ పిడుగుపాటుకు గురై చనిపోగా మరో ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నినెలల కిందట కామారెడ్డి మండలంలో కూలి పని చేస్తున్న ఓ మహిళ, క్యాసంపల్లిలో పంటల అమ్మకానికి తీసుకువచ్చిన రైతులు అకాల వర్షం పడడంతో చెట్టు కిందకు వెళ్లగా చెట్టుపై పిడుగుపడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. సదాశివనగర్ మండలంలో చెట్టు కింద కట్టేసిన ఒక ఆవు, గేదెపై పిడుగుపడడంతో మృత్యువాత పడ్డాయి. అలాగే బీబీపేట మండలం పిడుగు పడడంతో మేకలు, గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఎల్లారెడ్డిలో ఇటీవల ఆలయ గోపురంపై పిడుగుపడడంతో ఆలయ శిఖరం స్వల్పంగా ధ్వంసం కాగా ఆ ప్రాంతంలో ఉన్న కుక్క మరణించింది. ఇలా జిల్లాలో పలుచోట్ల పిడుగుపాటుతో పెను ప్రమాదాలే జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, రైతులు చెట్ల కింద, ఎత్తైన ప్రదేశాలలో ఉండకుండా అప్రమత్తత పాటించాలని నిపుణులు పేర్కొంటున్నారు.
అసలు పిడుగు అంటే..
మేఘాల వద్ద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం వల్ల ఆవిరి చిన్నచిన్న నీటి బిందువుల రూపంలో ఉంటుంది. ఇదే సమయంలో విపరీతమైన గాలులు వీచినప్పుడు మంచుకణాలు, నీటి బింఽదువుల మధ్య రాపిడి ఏర్పడి ఎలక్ట్రిక్ చార్జ్ ఉత ్పన్నమవుతుంది. దీంతో పాజిటివ్, నెగిటివ్ చార్జి ఉన్న కణాలు విడుదల అవుతాయి ఇలా రెండు వేర్వేరు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు రాపిడి జరుగుతుంది. దీంతో ఆ రెండింటి మధ్య మెరుపు(విద్యుత్), ఉరుము(శబ్దం) ఉత్పన్నమవుతాయి. ఈ సమయంలోనే మేఘంలోని కింది భాగంలో ఉండే నెగిటివ్ చార్జికణాలు భూ ఉపరితలంపై ఉండే పాజిటివ్ చార్జి కణాల చేత ఆకర్శించబడతాయి. మేఘాల్లో రాపిడికి ఉత్పనమైన విద్యుత్ భూమిని చేరుతుంది. దీన్ని మనం పిడుగు అంటాం. ప్రధానంగా ఈ నెగిటివ్ చార్జికణాలు భూమిని చేరే క్రమంలో ఎత్తయిన ప్రదేశాలు, చెట్లు, కొండలు, మనుషులు, జంతువుల ద్వారా ఆకర్షించబడి భూమిని చేరుతాయి. ఈ చేరే క్రమంలో ఆ కణాలు దేని ద్వారా చేరితే అవి బుగ్గికావడం చూస్తుంటాం.
పిడుగు పడినప్పుడు 2900 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉత్పన్నం
పిడుగుపాటు విషయంలో ప్రధానంగా పల్లెల్లో అనేక కథలు ప్రచారం ఉన్నాయి. దేవదానవ యుద్ధం కారణంగా ఇలా ఉరుములు, మెరుపులు వస్తాయని మెరుపులు వచ్చే సమయంలో అర్జున, పాల్గుణ అంటే వారు మనల్ని పిడుగుల భారీ నుంచి రక్షిస్తారని పెద్దలు చెబుతుంటారు. ఇవి ఏ మాత్రం నిజం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా సూర్యుని ఉపరితలంపై 5700 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ పిడుగు పడినప్పుడు ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితల ఉష్ణోగత్రకు సుమారు 5 రెట్లు అధికంగా 29000 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ముఖ్యంగా సెప్టెంబరు నుంచి డిసెంబరు, జనవరి, నుంచి మే నెలలో ఈ తరహాలో అకాలవర్షాలు పడడం, వడగండ్లు పడడంతో పాటు పెద్ద ఎత్తున పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పంటలు కోతకు వచ్చే సమయం కావడంతో పాటు వరిధాన్యం కుప్పల వద్ద రైతులు సేదతీరడం లాంటివి చేస్తుంటారు. వాతావరణంలో మార్పులు రావడంతో పాటు పెద్ద ఎత్తున గాలులు, ఆకాశంలో మెరుపులు కనిపించినప్పుడు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడంతో పాటు పశువులను సైతం సురక్షితప్రాంతాలకు తరలించాలి.
నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు
జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిడుగుపాటు నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు పిడుగులు పడే సమయంలో ఫోన్లు మాట్లాడకపోవడమే మంచిది. ఉరుములు,మెరుపుల వేళలో టీవీలు చూడటం ప్రమాదకరం. అంతేకాక స్వీచ్బోర్డుల నుంచి ప్లగ్లు తీసివేయాలి లేదంటే ఎలక్ట్రిక్ వస్తువులు పాడయ్యే ప్రమాదముంటుంది. ఇంటి కిటికీలు, తలుపుల దగ్గర నిలబడి బయటకు చూడటం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కిందకు వెళ్లకూడదు. ఒకవేళ బయట ఉన్నప్పుడు ఉరుములు, మెరుపులు పడే అవకాశముంటే ఎత్తు తక్కువగా ఉండే ప్రదేశాల్లో కూర్చోని రెండు కాళ్లమధ్య తల ఉంచి చెవులు, కళ్లు ముసుకుని ఉండాలి. పెంపుడు జంతువులను ఎట్టి పరిస్థితుల్లో బయట వదిలేయకుండా షెడ్లలో ఉంచాలి. ఉరుముల వేల మన శఽరీరం జలదరింపునకు గురి కావటం, వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం వంటి సంకేతాలు కనిపిస్తాయని ఇలా జరిగితే పిడుగు మీ దగ్గరలో పడుతున్నట్లు అర్థం. అప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి.