ఆ స్థలానికి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి
ABN , First Publish Date - 2022-07-07T04:51:30+05:30 IST
మండలంలోని సిరిపురంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ స్థలానికి సంబంధించిన పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని ఆ గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్లు, ఆలయకమిటీ స్పష్టం చేశారు.
సర్పంచ్, మాజీ సర్పంచ్లు, ఆలయ కమిటీ స్పష్టీకరణ
వైరా, జూలై 6: మండలంలోని సిరిపురంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ స్థలానికి సంబంధించిన పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని ఆ గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్లు, ఆలయకమిటీ స్పష్టం చేశారు. ఆమేరకు బుధవారం ఖమ్మం దేవాదాయ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్కు ఒక వినతిపత్రం సమర్పించారు. ఆస్థలాన్ని తాము ఎవరికి విక్రయించలేదని, ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదని సంబంధించిన వారు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 1988లో సర్వేనెంబర్ 7లో 1210చదరపు గజాల స్థలాన్ని రూ.1,34,00కు గ్రామస్థులంతా కలిసి ఏపీ ఆయిల్సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించటం జరిగిందని, డాక్యుమెంట్ నెంబర్ 6244/1988 ఉందని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఆ వినతిపత్రం ద్వారా అందించారు. అయితే ఆతర్వాత ఏపీ ఆయిల్ సీడ్స్ కార్యకలాపాలు స్తంభించిపోవడంతో ఖాళీగా ఉన్న స్థలంలో బోడేపూడి సుజల స్రవంతి ఓహెచ్ఎ్సఆర్ ట్యాంకును అలాగే మిగిలిన స్థలంలో ఆలయాన్ని నిర్మించామని వివరించారు. అయితే 17సంవత్సరాల కిందట నిర్మించిన ఆలయం, ఆలయ ప్రహారీ శిథిలం కావడంతో పునర్నిర్మాణం కోసం 2018లో దేవాదాయ ధర్మాదాయశాఖకు విజ్ఞప్తి చేయగా రూ.37.37లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఆలయ వాస్తు రీత్యా అవసరమైన కొంత స్థలాన్ని ఇచ్చేందుకు మట్టూరి ఆంధ్రావాణి అంగీకరించారని ఆమేరకు స్థలదాతగా శిలాఫలకం ఏర్పాటుచేశామని గుర్తుచేశారు. అయితే ఆస్థలం ఇవ్వలేదని అంతేకాకుండా ఆలయం పక్కనే ఉన్న సరిహద్దు భూమికి పెన్సింగ్ వేసుకున్నారని, గుడి నిర్మాణ సమయంలో కానీ, ఆతర్వాత కానీ గతంలో విక్రయించిన స్థలం విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని వివరించారు. అయితే ఇప్పుడు ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్కు స్థలాన్ని అమ్మిఉండగా తాము ఎవరికి స్థలం అమ్మలేదని, ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. మంజూరైన నిధులతో వెంటనే టెండర్లు ఆహ్వానించి నిర్మాణాలు చేపట్టాలని ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మచ్చా వెంకటేశ్వరరావు, నంబూరి ప్రసాద్, సర్పంచ్ మట్టూరి సత్యప్రసనాంబ, మాజీ సర్పంచ్లు మట్టూరి వీరయ్య, మచ్చా నర్సింహారావు, గంధం కృష్ణయ్య, చప్పిడి స్వరూపరాణి, పర్చూరి రామారావు, పూసలపాడు సొసైటీ అధ్యక్షుడు గాలి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ మచ్చా వెంకటేశ్వరరావు(బుజ్జి), గ్రామ ప్రముఖులు దగ్గుపాటి సత్యనారాయణ, మట్టూరి నాగేశ్వరరావు, తూము కోటేశ్వరరావు, నలమల కోటేశ్వరరావు, చింతనిప్పు చంద్రరావు, వెంకటేశ్వరరావు తదితరులు వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.