గంగమ్మకు రైల్వే గేటు మార్గం సుగమం
ABN , First Publish Date - 2022-05-22T05:58:39+05:30 IST
కుప్పం పట్టణంలోని కొత్తపేటలో గంగమ్మ శిరస్సు ఊరేగింపునకు మార్గం సుగమమైంది. రైల్వే అధికారులు ఈ మేరకు హామీ ఇచ్చారు. కుప్పంలో కొలువై ఉన్న ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే.
కుప్పం, మే 21: పట్టణంలోని కొత్తపేటలో గంగమ్మ శిరస్సు ఊరేగింపునకు మార్గం సుగమమైంది. రైల్వే అధికారులు ఈ మేరకు హామీ ఇచ్చారు. కుప్పంలో కొలువై ఉన్న ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 24, 25 తేదీల్లో అమ్మవారి శిరస్సు ఊరేగింపు జరుగనుంది. ప్రతిసారీ ఈ ఊరేగింపు నేతాజీరోడ్డుమీదుగా రైల్వే గేటు దాటుకుని కొత్తపేటకు వెళ్లే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఆ పక్కనే రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించి, దానికి ప్రతిగా కొత్తపేట రైల్వే గేటు తొలగించి అడ్డుగా గోడ కట్టేశారు రైల్వే అధికారులు. దీంతో జాతర సందర్భంగా అమ్మవారి ఊరేగింపు కొత్తపేటకు వెళ్లే మార్గం మూసుకుపోయింది. దీనిపై శుక్రవారం బంగారుపేటలో ఉన్న రైల్వే అసిస్టెంట్ డివిజనల్ మేనేజరు విక్రమ్ గోహియను సాయిమాతా సేవాట్రస్టు అధ్యక్షుడు జగదీష్బాబు, కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ పీఏ రాములు కలిశారు. జాతర సందర్భంగా అమ్మవారి ఊరేగింపు కొత్తపేట చేరేందుకోసం రైల్వే గేటు వద్ద రాకపోకలకు తాత్కాలిక అనుమతి ఇవ్వాలని వారు విన్నవించారు. వారి విన్నపం మేరకు శనివారం విక్రమ్ గోహియ కుప్పం వచ్చారు. మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుఽధీర్ సుధీర్, జగదీష్బాబుతోపాటు స్థానిక రైల్వే అధికారులతో కలిసి రైల్వే గేటు ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రధానంగా మంగళ, బుధవారాల్లో రెండురోజులపాటు అమ్మవారి ఊరేగింపు ఉన్నందున ఆ రోజుల్లో మాత్రం గేటుకు అడ్డుగా కట్టిన గోడ తొలగించి, తర్వాత తిరిగి నిర్మించేందుకు గోహియ అనుమతించినట్టు జగదీష్బాబు తెలిపారు. కొత్తపేటవాసుల కోరిక మేరకు తమ విన్నపం మన్నించినందుకు ఆయన రైల్వే ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు.