వరికి తెగుళ్ల బెడద
ABN , First Publish Date - 2021-11-02T05:30:00+05:30 IST
మండలంలో ఖరీఫ్ చివరి సమయంలో సాగు చేసిన వరి పైరుకు తాటాకు తెగుళ్లు, ఉల్లికోడు, దోమపోటు ఆశించింది.
- ఆందోళనలో రైతులు
రుద్రవరం, నవంబరు 2: మండలంలో ఖరీఫ్ చివరి సమయంలో సాగు చేసిన వరి పైరుకు తాటాకు తెగుళ్లు, ఉల్లికోడు, దోమపోటు ఆశించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలో 17 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కంకి దశలో ఉన్న సమయంలో దోమపోటు, తాటాకు తెగుళ్లు సోకడంతో దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందే వరి పంటకు గిట్టుబాటు ధర లేక గత ఏడాది పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక అలాగే నిల్వ ఉంచామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరి పైరుకు తాటాకు తెగుళ్లు
వరి పైరుకు తాటాకు తెగుళ్లు సోకింది. మందులు పిచికారీ చేస్తున్నాం. పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గుతుంది. ధాన్యానికి గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నాం.
- నరసింహుడు, రైతు, కోటకొండ
వరి పైరుకు దోమపోటు
వరి పైరుకు దోమపోటు ఆశించడంతో మందులు పిచికారీ చేస్తున్నాం. వరి పైరు సాగు చేయాలంటే ఆందోళనగా ఉంది. పెట్టుబడి పెరుగుతోంది. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు.
- వెంకటపతి, రైతు, కోటకొండ
రైతులకు సలహాలు ఇస్తున్నాం
వరి పైరులో ఆశించిన తెగుళ్ల గురించి దోమపోటు నివారణకు ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. గ్రామాలు తిరిగి పొలంబడి నిర్వహించి ఏ దశలో ఏ తెగులుకు ఏ మందు పిచికారీ చేయాలో రైతులకు వివరించాం.
- ప్రసాదురావు, ఏవో, రుద్రవరం