అరెస్టులకు భయపడం

ABN , First Publish Date - 2022-01-26T08:14:58+05:30 IST

‘చర్చలకు రాలేదని అంటున్నారు! అసలు మీ విధానం ఏమిటి? ఏ విధంగా రావాలి!’ అంటూ పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ అగ్రనేతలు ప్రభుత్వ పెద్దలపై ధ్వజమెత్తారు. విజయవాడ ధర్నాచౌక్‌లో నిర్వహించిన మహాధర్నాలో వీరు మాట్లాడుతూ ‘అరెస్టులు చేసినా ఫర్లేదు! మా ఉద్యోగాలు పోయి ..

అరెస్టులకు భయపడం

నాలుగు జేఏసీలు ఒక్కటయ్యాయి.. అందరిదీ ఒకే మాట, ఒకే ధ్యాస 

విజయవాడ మహాధర్నాలో స్ట్రగుల్‌ కమిటీ అగ్రనేతల గర్జన


విజయవాడ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ‘చర్చలకు రాలేదని అంటున్నారు! అసలు మీ విధానం ఏమిటి? ఏ విధంగా రావాలి!’ అంటూ పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ అగ్రనేతలు ప్రభుత్వ పెద్దలపై ధ్వజమెత్తారు. విజయవాడ ధర్నాచౌక్‌లో నిర్వహించిన మహాధర్నాలో వీరు మాట్లాడుతూ ‘అరెస్టులు చేసినా ఫర్లేదు! మా ఉద్యోగాలు పోయి నా బాధపడం’ అంటూ తేల్చి చెప్పారు. ‘మాకు వ్యతిరేకంగా ప్రజలలో మీరు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరు. ఉద్యోగులు కూడా ప్రజలలో భాగమే. అలాగే ప్రభుత్వంలో కూడా భాగమే. మా అపోహలు తీర్చటానికి కమిటీ వేశామంటున్నారు. ముందు మీ అపో హలు తొలగించుకోండి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కంటే జీతాలెక్కువ అని ప్రచారం చేస్తున్నారు. ఇక మీ నాలుగు స్తంభాలాటలు సాగవు. సమ్మె వరకు వెళ్లకుండానే ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందనుకుంటు న్నాం. ఉద్యమం ప్రారంభించాం కాబట్టి సాధించే వరకు పోరాటం ఆపం’ అని తేల్చి చెప్పారు. నేతలు ఎవరు ఏమన్నారో వారి మాటల్లోనే..


ఇన్నేళ్ల చరిత్రలో లేదు..

ఆత్మగౌరవం, హక్కుల కోసం ఈ రోజున ప్రభుత్వంతో పోరాటం జరుగుతోంది. ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా4 జేఏసీలు ఒకే వేదికన ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. సచివాలయ ఉద్యోగుల పక్షాన కూడా జేఏసీలతో కలిసి పని చేయటం ఇదే మొదటి సారి. ఇక మునిగినా, తేలినా అందరితో పాటే. 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లాలని సచివాలయ ఉద్యోగుల సంఘం సాధారణ సమావేశంలో తీర్మానించింది. ఈ ఉద్యమం గతంలో కంటే భిన్నమైనది. 

వెంకట్రామిరెడ్డి, ఏపీజీఈఎఫ్‌ చైర్మన్‌


ముందు మీ అపోహలు తొలగించుకోండి..

మీరు మాపై వలంటీర్ల ద్వారా ప్రజల్లో ప్రచారం చేయించినా.. ప్రజలు వాటిని నమ్మరు. అపోహలు తొలగించటానికి మంత్రుల కమిటీ అంటున్నారు. పన్నెండు సార్లు చర్చించారు. మళ్లీ అపోహలు తీర్చుతాం.. చర్చలనటం ఏమిటి? అపోహలు మాకు కాదు. మీరు అపోహలు తొలగించుకోండి. మా ఉద్యోగ జేఏసీలన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఉద్యోగ సంఘాలను దుర్మా ర్గంగా దూషిస్తున్నారు. మాటల యుద్ధం చేస్తున్నారు. సమ్మెవరకు వెళ్లకుండా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేది ఉద్యోగులం కాదా? కొత్తవి ఇవ్వకపోగా, గతంలో వాటిని కూడా రద్దు చేస్తూ చీకటి జీవోలు ఇచ్చారు.

బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌


అయోమయంలో ప్రభుత్వం..

ప్రభుత్వంతో చర్చలకు వెళ్లటానికి.. అసలు మీది ఏ విధానమో స్పష్టం చేయాలని కోరుతున్నాను. మీరు అమలు చేస్తున్నది ఏ పీఆర్‌సీ? కేంద్ర పీఆర్‌సీనా? 2016లోని కేంద్ర పీఆర్‌సీని అమలు చేస్తున్నారా? 7వ కేంద్ర పీఆర్‌సీని అమలు చేయాలనుకుంటున్నారా? కేంద్ర పీఆర్‌సీ ప్రకారం హెచ్‌ఆర్‌ఏ స్లాబులు తీసివేశామంటున్నారు. అలా అనుకుంటే కేంద్ర పీఆర్‌సీ ప్రకారం ఉద్యోగులకు 104 రకాల అలవెన్సులు రావాలి. రోజువారీ ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వాలి. మరి ఇస్తారా? కేంద్ర పీఆర్‌సీని పబ్లిక్‌ డొమెయిన్‌లో ఉంచారు. మరి మీరు ఉంచలేదేం? ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం అయోమయంలో ఉందని అర్థమవుతోంది. మీరు ఏ విధానంలో చర్చిస్తారో చెబితే మిగిలిన ముగ్గురు జేఏసీల నేతల కాళ్లు అయినా పట్టుకుని మీతో చర్చలకు తీసుకొస్తాను. ప్రభుత్వం నాలుగు స్తంభాలాటకు ఇక అవకాశం ఇవ్వం. నాలుగు జేఏసీల కలయిక నేపథ్యంలో ప్రభుత్వం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మేమడగకుండానే పెంచారు. కేంద్ర ప్రభుత్వ పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు ఉంది. యూజీసీ రూల్స్‌ ప్రకారం చూస్తే 60, 65 సంవత్సరాలుగా ఉంటుంది. మీరు 62 సంవత్సరాలు పెంపుదల చేయటంలోని ప్రాతిపదిక ఏమిటి? 1986లో ఎన్‌టీఆర్‌ ప్రభుత్వంలో ఉండగా.. త మ హక్కుల కోసం ఉద్యోగులు ఉద్యమ పోరాటం సాగించారు. నేటి తరం అలాంటి ఉద్యమ స్ఫూర్తిని పొందలేరేమోననుకునే వాడిని. ఆ అవకాశాన్ని కల్పించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు. 

కేఆర్‌ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు 


ఒకే మాట.. ఒకే పంథా..

ఉన్న వాటిని తీసేస్తే కొత్త డిమాండ్లు రావన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. మా నాలుగు జేఏసీలది ఒకే మాట, ఒకే పంథా, ఒకే ధ్యాస, ఒకే శ్వాస. మా ఉద్యమంలో ఎలాంటి స్వప్రయోజనాలూ లేవు. ఈ ప్రభుత్వ ఉడత ఊపులకు భయపడం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అనుకోవద్దు. పోరాటాల ద్వారానే సాధించుకుందాం. అరెస్టులకు భయపడేది లేదు. గుర్రాలతో తొక్కించిన చరిత్ర కూడా ప్రభుత్వాలకు ఉంది. ఒక వైపు ఫ్రెండ్లీగా ఉన్నామని చెబుతూనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనాలు వస్తున్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మేమేమైనా గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నామా ? మాకు రావాల్సిన పెండింగ్‌ డీఏలు, గతంలో సాధించుకున్న హక్కులనే కదా కోరుతున్నాం!

 బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్‌


ఉద్యమాలు కొత్త కాదు..

1958 నుంచి పీఆర్‌సీ తెచ్చుకుంటున్నాం. 2021లో పే రివిజన్‌ కాస్తా.. పే రివర్స్‌ కమిటీ అయింది. ఉద్యమం వరకు వెళితే సాధించేదాక విడవని చరిత్ర మనకు ఉంది. ఉద్యోగులకు జరుగుతున్న నష్టాన్నే ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఉద్యమాలు మనకు కొత్త కాదు. ఈ రోజున రాష్ట్రంలోని వర్కింగ్‌ క్లాస్‌ అంతా ఒకే వేదిక మీదకు వచ్చింది. ఉద్యమం గట్టిగానే ఉంటుంది. ప్రభుత్వం పునరాలోచించుకుని మెట్టు దిగి నమ్మకం కల్పించి చర్చలకు ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. 

సుధీర్‌ బాబు, ఫ్యాప్టో చైర్మన్‌

Updated Date - 2022-01-26T08:14:58+05:30 IST