దళితులకు భూ పంపిణీ ఏదీ?
ABN , First Publish Date - 2020-07-14T10:37:04+05:30 IST
దళితులకు భూపంపిణీ పథకం ప్రారంభం నుంచే ధర విషయంలో పీటముడి పడింది.
50వేల ఎకరాలకు ఇచ్చింది 612 ఎకరాలే
పెరిగిన భూముల దరలకు అనుమతించని బడ్జెట్
మూడేళ్లుగా నిలిచిన పథకం
దళితులకు మూడెకరాల భూపంపిణీ పథకం అడుగు ముందుకుపడటం లేదు. పథకంలో లబ్ధిదారులను గుర్తించి ఏళ్లు గడుస్తున్నా అందరికీ భూమి పంపిణీ చేయలేదు. ప్రభుత్వం నిర్ణయించిన రేటు గిట్టుబా టు కాకపోవడంతో భూముల విక్రయానికి పట్టాదారులు ముందుకురావడం లేదు. ఫలితంగా జిల్లాలో మూడేళ్లుగా పథకం నిలిచిపోయిం ది. 2018-19 నుంచి ఈ పథకానికి సంబంఽధించిన కార్యాచరణ ప్రణాళిక ఖరారు కాలేదు. జిల్లాలో దళితులందరికీ భూపంపిణీ చేసేందుకు 50వేల ఎకరాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 612 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి , నల్లగొండ: దళితులకు భూపంపిణీ పథకం ప్రారంభం నుంచే ధర విషయంలో పీటముడి పడింది. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడాల్సి వస్తోం ది. దీంతో బడ్జెట్పై భారం పడుతుండటంతో గత ఏడాది చివర్లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఈ పథకంలో స్వల్ప మార్పులు చేశారు. తొలుత నిర్ణయించిన ధర ప్రకారం భూములు కొనడం సాధ్యంకాదని అధికారులు తేల్చిచెప్పడంతో సవరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఎంత వరకు ఇస్తామనేది ముందే చెప్పకుండా, తొ లుత భూములు సేకరించాలని సూచించింది. ఎకరం, రెండు ఎకరాలు కాకుండా ఒకేసారి వందల ఎకరాలు కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. దానికి అనుగుణంగా జిల్లాలో భూముల కొనుగోలుకు బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ధర విషయాన్ని ప్రస్తావించకుండా, భూసేకరణకు ప్రయత్నం చేయగా పట్టాదారులు ముందుకురాక అది నిలిచిపోయింది.
జిల్లాలో ముగిసిన గడువు
పూర్వ జిల్లాలను ప్రామాణికంగా తీసుకొని భూములు సేకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నల్లగొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు కలి పి కనీసంగా 250 ఎకరాలకు తగ్గకుండా భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి వరకే అందుకు గడువు విధించింది. పాత ధర ప్రకారం ఎకరాకు రూ.7లక్షలు చెల్లిస్తుండగా, ప్రస్తుతం ధర ప్రస్తావన లేకుండా భూములు విక్రయించే వారి నుంచి దరఖాస్తు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఏ ప్రాంతంలో ఎంత ధర, ఎంత భూమి లభిస్తోందో పరిశీలించాక, దాన్ని అనుసరించి జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో రేటు నిర్ణయించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం విధించిన గడువు ముగిసి కూడా నాలుగు నెలలు పూర్తయింది. కానీ, భూసేకరణ జరగలేదు. ప్రస్తుతం మార్కెట్లో రూ.10లక్షలు చెల్లించనిదే ఎకరా భూమి దొరకడంలేదు. ఇది భూసేకరణ కు ఇబ్బందిగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు.
ఐదేళ్లలో 234 మందికే
ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.7లక్షలు కాగా, అంతకంటే తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ పథకం ప్రారంభంలో భూములు విక్రయించేందుకు పట్టాదారులు ఆసక్తి చూపించారు. ఆతరువాత రైతుబంధు, రైతు బీమా, కేంద్రం నుంచి మోదీ పెట్టుబడి సాయం అందుతుండటం, భవిష్యత్తులో ఎరువులు ఉచితంగా ఇస్తారన్న ప్రచారం, పంట దిగుబడులు భారీగా వస్తుండటంతో భూము లు విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. 2014లో ఈ పథ కం ప్రారంభం కాగా, 2017-18వరకు జిల్లాలో కేవలం 234 మందికే భూములు పంపిణీ చేశారు. మొత్తం 31మండలాలకు, 15 మండలాల్లోని 19 గ్రామాల్లో మాత్ర మే దళితులకు లబ్ధిచేకూరింది. ఇప్పటి వరకు మొత్తం 612 ఎకరాలు పంపిణీ చేయగా, అందులో 34.06ఎకరాలు మాత్ర మే ప్రభుత్వ భూమి. మిగిలిన 578 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయగా, అందుకు రూ.24.34కోట్లను ప్రభుత్వం చెల్లించింది.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకే పథకం నిలిచింది
ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేకే దళితులకు భూపంపిణీ మూడేళ్లుగా నిలిచింది. భూమి కొనుగోలుకు అవసరమైన బడ్జెట్ను కేటాయించలేదు. జిల్లాలో భూ పంపిణీని పర్యవేక్షించాల్సిన ఎస్సీ కార్పొరేషన్ డీడీ కూడా ఇన్చార్జే. పూర్తిస్థాయి అధికారి ఉంటే దళితులను చైతన్యం చేసి భూమి కోసం వెతుకులాటతోపాటు, నిత్యం పర్యవేక్షించే వీలుంటుంది. ఎకరాకు రూ.10లక్షలు చెల్లించకుండా ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేయడం ఈ రోజుల్లో సాధ్యం కాదు. అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లిలో దళితులకు భూమి కేటాయించారు. పట్టాలు ఇచ్చాక పట్టించుకున్న నాథుడేలేరు. భూఅభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంతో అక్కడ ఉపయోగం లేకుండాపోయింది. సాగుకు ఐదేళ్లపాటు ఆర్థికసాయం చేయాలి.
- పాలడుగు నాగార్జున, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి