రైతులు కోరిన విత్తనాలను అందుబాటులో ఉంచాలి

ABN , First Publish Date - 2021-12-08T06:28:08+05:30 IST

వరికి ప్రత్యామ్నాయంగా రైతులు కోరిన విత్తనాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ అధికారులకు సూచించారు.

రైతులు కోరిన విత్తనాలను అందుబాటులో ఉంచాలి
రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

- యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

సుల్తానాబాద్‌, డిసెంబరు 7: వరికి ప్రత్యామ్నాయంగా రైతులు కోరిన విత్తనాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ అధికారులకు సూచించారు. యాసంగి పంటల సాగుకు సంబంధించి సుల్తానాబాద్‌ పట్టణంలోని యాదవనగర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులతో కలెక్టర్‌ మాట్టాడారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై పెద్ద ఎత్తున అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. యాసంగిలో ఎఫ్‌సీఐ ద్వారా వడ్లు కొనుగోలు లేనందున ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పారు. రైతులు తమ సొంత భరోసాపైన మిల్లర్లు, సీడ్‌ కంపెనీ వారితో చేసుకున్న ఒప్పందం మేరకే వరి సాగు చేసుకోవాలన్నారు. వరికి బదులు కందులు, మినుములు, జొన్నలు, నువ్వులు తదితర లాభసాటి పంటలు వేసుకోవాలన్నారు. రైతులకు వారు కోరిన విత్తనాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.  కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల్‌ ప్రసాద్‌, మండల, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T06:28:08+05:30 IST