కార్మికులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-01-28T06:06:31+05:30 IST
సింగరేణిని ప్రైవేటీకరణను అడ్డుకుంటామని టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తోందని సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘ్(బీఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు.
- బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య
గోదావరిఖని, జనవరి 27: సింగరేణిని ప్రైవేటీకరణను అడ్డుకుంటామని టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తోందని సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘ్(బీఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య అన్నారు. గురువారం స్థానిక యూనియన్ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్లో బొగ్గు గనుల చట్టం ఎంఅండ్ఎండీఆర్ - 2017 చట్టం చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ప్రకటించి, ఇప్పుడు కార్మికులను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ అంటూ కమర్షియల్ మైనింగ్ విధానాన్ని ఈ-వేలం పాట ద్వారా చేస్తున్న ప్రక్రియను అడ్డుకోవడానికి 2017 నుంచి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కలువలేదని, ఎందుకు అడ్డు చెప్పలేదో కార్మికులకు చెప్పాలన్నారు. 2019కి ముందు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కార్మిక నాయకులు ఐక్య ఉద్యమాలు చేసి వేలం పాటల లిస్టు నుంచి 88 ఆయా రాష్ట్రాల సంస్థలకు చెందే విధంగా పోరాటం చేసిన సమయంలో రాష్ట్రం నుంచి ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. బొగ్గుగని కార్మికులు దేశ వ్యాప్త సమ్మె చేసినప్పుడు ఎందుకు విచ్ఛిన్నం చేశారన్నారు. గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్ సింగరేణిలో విచ్చలవిడిగా జరుగుతున్న ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేదో చెప్పాలన్నారు. దేశంలో జరుగుతున్న కమర్షియల్ మైనింగ్ కంటే సింగరేణిలో జరుగుతున్న ప్రైవేటీకరణ కార్మికులకు, పరిశ్రమకు చాలా ప్రమాదకరమని తెలిసినా యాజమాన్యానికి వత్తాసు పలికారని ఆరోపించారు. అండర్ గ్రౌండ్ గనులు మూసి వేస్తున్నా ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. అత్యంత ప్రాధాన్యం కలిగిన జీడీకే 5ఇంక్లైన్ ఓసీపీని చేస్తామని యాజమాన్యం ప్రకటిస్తే టీబీజీకేఎస్ నోరు మెదపలేదన్నారు. సమావేశంలో నాయకులు వై సారంగపాణి, పెండం సత్యనారాయణ, గాజుల వెంకటస్వామి, సాయవేని సతీష్, పోతరవేణి విజయ్కుమార్, వై కోటయ్య, పల్లె శ్రీనివాస్, తాట్ల లక్ష్మయ్య, పోతరాజు భాస్కర్, మేడ రాంమూర్తి, పోరాండ్ల వెంకటేశం, ఎర్రవెల్లి రమేష్, గుండబోయిన భూమయ్య, చిగురు లక్ష్మణ్ పాల్గొన్నారు.