వాగును చెరబట్టారు

ABN , First Publish Date - 2021-01-25T03:08:32+05:30 IST

అధికారుల పట్టింపులేనితనం, స్థానిక నాయకుల అండదండలతో ఇసుక అక్రమ దందా మూడుపువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది.

వాగును చెరబట్టారు
పెద్దవాగులో నిబంధనలకు విరుద్ధంగా జరిపిన తవ్వకాలు

  అధికారుల పట్టింపులేనితనం, స్థానిక నాయకుల అండదండలతో ఇసుక అక్రమ దందా మూడుపువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. వాగుల వెంట పట్టా భూముల్లో ఇసుకమేటలున్నాయని, ప్రభుత్వ పనుల నిర్మాణాల కోసమేనని తవ్వకాలకు అనుమతులు తీసుకొని అడ్డగోలుగా వాగులను ధ్వంసం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అడవిసత్యవార్‌లో దందా యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు.

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి

అడవిసత్యవార్‌లో పెద్ద వాగుని ఆనుకొని సర్వే నంబర్‌ 52/ఏ/1లో గల 27 గుంటల భూమిలో 5,368 క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వలున్నాయని నిర్ధారించారు. జిల్లా స్థాయి కమిటీ ఇందులో కేవలం 1,000 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను నిర్ణీత పరిధిలో తవ్వేందుకు అనుమతించారు. డిసెంబర్‌ 10 నుంచి ఫిబ్రవరి ఏడో తేదీలోగా 1,000 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించాల్సి ఉంది. ఇసుక తవ్వకాలు, రవాణా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే, అది కూడా రెవెన్యూ, టీఎస్‌ఎండీసీ సిబ్బంది సమక్షంలో జరగాల్సి ఉంది. అయితే ఈ రీచ్‌ నిర్వాహకులకు రాజకీయ అండదండలు ఉండడం, స్థానిక నాయకులే కావడంతో ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతూ వాగును ధ్వంసం చేశారు. నిర్ణీత సరిహద్దుల్లో కాకుండా పూర్తిగా వాగులోకి వెళ్లి, మట్టి తేలేంతవరకు ఇసుకను తవ్వేస్తున్నారు. పగలు, రాత్రి తేడాల్లేకుండా ఎక్స్‌కవేటర్లతో తవ్వకాలు జరుపుతున్నారు. లారీల్లో హైదరాబాద్‌, మక్తల్‌, తాండూరు, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వంద వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారని, పట్టా భూముల్లో ఇసుక మేటల పేరుతో వాగును ధ్వంసం చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం కనీస చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలొస్తున్నాయి. తాజాగా మరోవారం రోజుల్లో ఈ అనుమతులు ముగుస్తుండడంతో మరో దఫా అనుమతులు సాధించేందుకు ఈ అక్రమ తవ్వకందార్లు సిద్ధమవుతున్నారని, అనుమతులివ్వకుండా నిరోధించాలని స్థానికులు వాపోతున్నారు.

Updated Date - 2021-01-25T03:08:32+05:30 IST