లక్ష్యం అనుమాన‘మే’!
ABN , First Publish Date - 2021-05-10T04:46:11+05:30 IST
ఇళ్ల నిర్మాణాలపై కరోనా ప్రభావం పడింది. మేలో మంచి ముహుర్తాలు ఉండడంతో ఎక్కువ మంది లబ్ధిదారులు నిర్మాణాలకు సన్నద్ధమయ్యారు. కాగా కరోనా విజృంభిస్తుండడంతో పునరాలోచనలో పడ్డారు.
జిల్లాలో ప్రారంభం కాని ఇళ్ల నిర్మాణాలు
కరోనా భయంతో లబ్ధిదారుల వెనకడుగు
నెలాఖరుకు 20 వేలు టార్గెట్
తలపట్టుకుంటున్న అధికారులు
విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి): ఇళ్ల నిర్మాణాలపై కరోనా ప్రభావం పడింది. మేలో మంచి ముహుర్తాలు ఉండడంతో ఎక్కువ మంది లబ్ధిదారులు నిర్మాణాలకు సన్నద్ధమయ్యారు. కాగా కరోనా విజృంభిస్తుండడంతో పునరాలోచనలో పడ్డారు. వైరస్ ప్రభావం తగ్గిన తరువాతే నిర్మాణాలు చేపట్టడం మేలని భావిస్తున్నారు. అయితే పలుచోట్ల కొంతమంది ఇప్పటికే భూమి పూజ నిర్వహించారు. జిల్లాలోని పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గంలో ఎక్కువమంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటివరకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న మండలాల్లో 50 వేలకు గాను ఆరు వేల మంది మాత్రమే నిర్మాణాలను ప్రారంభించగా, ఏజెన్సీలో ఏడువేల మందిలో సుమారు రెండు వేల మంది పనులు ప్రారంభించారు. అయితే నిర్మాణాలకు ప్రధానంగా తాపీమేస్ర్తిల అవసరమున్నందున పొరుగు గ్రామాల నుంచి వారిని పనులకు అనుమతించడానికి ఎక్కువమంది అంగీకరించడం లేదు. పనులు పర్యవేక్షించాల్సిన అధికారులను కూడా గ్రామాలకు రావద్దని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోకే ప్రమాదముందని, ఎటువంటి రిస్క్ తీసుకోలేమని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పనులు చేపట్టేలా లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చేందుకు అధికారులూ వెనుకంజ వేస్తున్నారు. నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకొచ్చిన వారి వివరాల నమోదుకు మాత్రమే ఆమోదముద్ర వేస్తున్నారు.
ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ఇప్పటికే బోర్లు వేసినప్పటికీ, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. హౌసింగ్ సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారిన పడిన నేపథ్యంలో విధులకు హాజరయ్యేందుకు మిగిలిన వారు వెనకడుగు వేస్తున్నారు. వైరస్ నుంచి కొలుకున్నప్పటికీ విధులు చేపట్టడం సాధ్యం కాదని మరికొంత మంది తేల్చి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణానికి సిబ్బందిపై జిల్లా యంత్రాంగం పెద్దగా ఒత్తిడి చేయడంలేదు. వైరస్ నియంత్రణలోకి వచ్చిన తరువాత పనులు వేగవంతం చేస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు. కాగా మే నెలాఖరుకి 20 వేల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని అంచనా వేశామని, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చని హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. నిర్మాణాలకు ముందుకు వచ్చే లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నామని, కరోనా తీవ్రత తగ్గిన తరువాత నిర్మాణాలను ప్రారంభిస్తామన్నారు.