ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం ఇతివృత్తం ఇదే!

ABN , First Publish Date - 2021-07-11T00:10:28+05:30 IST

ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతారు.

ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవం ఇతివృత్తం ఇదే!

న్యూఢిల్లీ : ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతారు. కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాలు, స్త్రీ, పురుష సమానత్వం, మానవ హక్కులు వంటివాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 


ప్రపంచ జనాభా దినోత్సవం, 2021 ఇతివృత్తం ఏమిటంటే, ‘‘హక్కులు, ఎంపిక చేసుకునే అవకాశాలే సమాధానం : జననాల రేటు పెరగడం లేదా తగ్గడం, ప్రజలందరి సంతానోత్పత్తి ఆరోగ్యానికి, హక్కులకు ప్రాధాన్యమివ్వడంలోనే మారుతున్న సంతానోత్పత్తి సామర్థ్య రేట్లకు పరిష్కారం ఉంది.’’


యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ గవర్నింగ్ కౌన్సిల్  ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రకటించింది. ఏ రోజున ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తారో, ఆ రోజున (1987 జూలై 11న) దీనిని జరపాలని నిర్ణయించింది. దీనిని కొనసాగించాలని 1990లో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ తీర్మానం చేసింది. అధిక జనాభా ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపింది. 


కుటుంబ నియంత్రణ, పౌర హక్కులు, పేదరికం, మానవాళిపై అధిక జనాభా చూపే ప్రభావం గురించి ప్రజలకు వివరించడానికి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ప్రపంచంలో అధిక జనాభా గల దేశాల్లో చైనా తర్వాత భారత దేశం నిలిచింది. అధిక జనాభా కారణంగా కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించడం పెద్ద సవాలుగా మారింది. 


సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, 2030 ఎజెండా అనేది ఆరోగ్యవంతమైన భూ మండలంపై ప్రజలందరికీ మెరుగైన భవిష్యత్తుకు ప్రపంచ బ్లూప్రింట్ అని ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. జనాభా వృద్ధి, వృద్ధాప్యం, వలసలు, పట్టణీకరణ సహా జనాభా ధోరణులతో ఈ మిషన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. 






Updated Date - 2021-07-11T00:10:28+05:30 IST