త్రివర్ణ శోభితం!
ABN , First Publish Date - 2022-08-11T06:25:42+05:30 IST
త్రివర్ణ శోభితం!
ఆజాదీ కా ఆమృత్ మహోత్సవ్లో భాగంగా కొత్తూరు తాడేపల్లిలో 400 అడుగుల జాతీయ పతాక ప్రదర్శన
పీవీపీ మాల్లో ఫ్లాష్మాబ్స్.. ఎన్ఎస్ఎం స్కూల్లో ఫిలాటెలి ఎగ్జిబిషన్
విజయవాడ రూరల్, ఆగస్టు 10: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కొత్తూరు తాడేపల్లిలోని అలిగినేని పెద ముత్తయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 400 అడు గుల పొడవున్న జాతీయ పతాక ప్రదర్శనను బుధవారం నిర్వహించారు. 450 మంది విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పాఠశాల వద్ద సర్పంచ్ ఉయ్యూరు గోపాలరావు, ఎంపీటీసీ సభ్యురాలు సప్పిడి వెంకట దుర్గ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విజయవాడ - విస్సన్నపేట ఆర్ అండ్ బీ రోడ్డు మీదుగా పంచాయతీ కార్యాలయం వరకు వెళ్లి తిరిగి ఆ ర్యాలీ పాఠశాలకు చేరుకుంది. ఈనెల 13, 14, 15 తేదీల్లో ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగుర వేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ఎస్కే బాజీ, హెచ్ఎం ఐ.విజయ్, పరికల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు.
పీవీపీ మాల్లో..
కలెక్టరేట్: స్వాతంత్య్ర స్ఫూర్తితో దేశ సమైక్యత, సమగ్రతను కాపాడడానికి యువత పాటుపడి, దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేయాలని కలెక్టర్ ఎస్.దిల్లీరావు సూచించారు. లబ్బీపేట పీవీపీ మాల్లో నిర్వహించిన ఫ్లాష్ మాబ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో యువత ఆలోచనలు అంశంపై జరిగిన ప్రసంగాలు, దేశ భక్తి గేయాలతో కూడిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. జిల్లా ఉపాధి అధికారి పీవీ రమేష్కుమార్, టూరిజం అధికారి హేమచంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.
పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో..
పటమట: ఎన్ఎస్ఎం స్కూల్లో విద్యార్థులకు ఫిలాటెలి ఎగ్జిబిషన్ నిర్వహించినట్లు విజయవాడ డివిజన్ సూపరింటెండెంట్ పోస్టాఫీసెస్ కె.ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఎగ్జిబిషన్లో పలు రకాల స్టాంపులను ప్రదర్శించామన్నారు. మైస్టాంపు అనే ఒక స్టాల్ను ఏర్పాటు చేశామని, మన ముఖ చిత్రాన్ని స్టాంపుపై ముద్రించే వెసులుబాటు స్టాల్లో అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. అకాంపెక్స్ 2022లో భాగంగా విద్యార్థులకు మైవిజన్ సర్ ఇండియా 2047 అనే అంశంపై లెటర్ రైటింగ్ నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. జాతీయ జెండాలను విక్రయించటానికి స్టాల్ను ఏర్పాటు చేశామని వెంకటేశ్వరరావు తెలిపారు. సభా ప్రాంగణాన్ని ఎన్ఎస్ఎం స్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ ఎస్.రాయపురెడ్డి, ఫిలా టెలి ఎగ్జిబిషన్ను ఏసీపీ ఖాదర్ భాషా ప్రారంభించారు. పోస్టల్ శాఖ ఏఎస్పీలు ఎన్.శ్రీని వాసరావు, అహ్మద్ అలీ, రంగారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.