తల తెగనరికి.. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళ
ABN , First Publish Date - 2022-08-12T09:20:35+05:30 IST
తల తెగనరికి.. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళ
తల చేతితో పట్టుకుని రోడ్డుపై హల్చల్
రాయచోటిలో ప్రైవేటు టీచర్ దారుణ హత్య
రాయచోటి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ.. వరుసకు కోడలయ్యే మహిళను అతి కిరాతకంగా హతమార్చింది. తన సోదరుని కుమారుడితో కలిసి ఆమె తలనరికి.. దాన్ని పోలీస్ స్టేషన్ వరకూ తీసుకెళ్లి లొంగిపోయింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో గురువారం ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం మేరకు, కలకడ మండలం గుట్టపల్లెకు చెందిన పాకాల వసుంధరకు రాయచోటి పట్టణం కొత్తపేట రామాపురానికి చెందిన రాజాతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 9, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలున్నారు. రాజా 11 ఏళ్ల క్రితమే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఏడాది క్రితం వసుంధర అత్తకూడా అనారోగ్యంతో మరణించింది. ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న వసుంధర తన ఇద్దరు కుమార్తెలతో కలసి ఉంటోంది. వాళ్లు పై పోర్షన్లో ఉంటుండగా.. కింది భాగంలో వసుంధర అత్తకు చెల్లిలైన సుబ్బమ్మ ఉంటోంది. ఆమె ఒంటరి మహిళ. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సుబ్బమ్మ ఏదో మాట్లాడాలని పిలవడంతో వసుంధర ఆమె ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో సుబ్బమ్మ సోదరుని కుమారుడు చంద్రబాబు అక్కడే ఉన్నాడు. కొన్ని రోజులుగా వీళ్ల మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుబ్బమ్మ, చంద్రబాబు కలిసి వసుంధర తల తెగనరికారు. అనంతరం సుబ్బమ్మ.. మృతురాలి తలను ఒక చేత్తో.. మరొక చేత్తో కత్తిని పట్టుకుని కిలోమీటరు దూరంలో ఉన్న పోలీసుస్టేషన్కు వెళ్లింది. పట్టపగలు కావడంతో.. ఆ దృశ్యం చూసి జనం హడలిపోయారు. పోలీసులు కేసు నమోదు చేశారు.