సంక్షేమ పథకాల పేరిట వైసీపీ ప్రభుత్వం వంచన
ABN , First Publish Date - 2022-06-30T06:20:22+05:30 IST
ప్రభుత్వాలు ఇచ్చే స్కాలర్షిప్లకు అమ్మఒడిగా పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నదని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడుగు కుమార్ అన్నారు.
టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడుగు కుమార్
మహారాణిపేట, జూన్ 29: ప్రభుత్వాలు ఇచ్చే స్కాలర్షిప్లకు అమ్మఒడిగా పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నదని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడుగు కుమార్ అన్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి, ప్రజల నుంచి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అమ్మఒడిలో లబ్ధిదారుల సంఖ్య తగ్గించి, వారికి ఇచ్చే మొత్తంలో కోత విధించారని వివరించారు. నిత్యావసర ధరలు పెరుగుదలతో సామాన్యులు బతికే పరిస్థితి లేదని అన్నారు. ఆటో డ్రైవర్లకు రూ.పది వేలు ఇచ్చి, ఇతర మార్గాలలో వారి నుంచి అధిక మొత్తం వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అనితపై అసత్య అరోపణలు తగదు
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనితపై అసత్య ఆరోపణలు చేయటం వైసీపీ నీచ రాజకీయాలకు తార్కాణమని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ఎస్.అనంత లక్ష్మి అన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి అనిత ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. బూతులు మాట్లాడడం, వ్యక్తిగత దూషణలు తమ సంస్కృతి కాదన్నారు.