అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-08-03T05:13:42+05:30 IST
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
తాండూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఎల్మకన్నె గ్రామానికి చెందిన బొడ్డు గోపాల్(26) గత 15ఏళ్ల క్రితం పని నిమిత్తం తాండూరుకు వచ్చాడు. ఆతర్వాత తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో గోపాల్ తల్లి నాగమ్మ జూలై 12వ తేదీన కరన్కోట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తాండూరు-కొడంగల్ రోడ్డు మార్గంలోని గౌతమి మోడల్ స్కూల్ వెనుక భాగంలో గల నిర్మానుష్య ప్రదేశంలో సోమవారం ఓగుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయినట్లు తెలిపారు. మిస్సింగ్ కేసులను పరిశీలించగా మృతుడు గోపాల్గా గుర్తించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.