ఆకాశమంత.. అబద్ధం

ABN , First Publish Date - 2022-01-22T07:53:04+05:30 IST

మాటలు ఆకాశంలో ఉన్నాయి. ఆకాశయానంపై ఈ ప్రభుత్వం మాటలు చూస్తే కొత్తగా ఏదో జరిగిపోతుందని అనిపిస్తుంది.

ఆకాశమంత.. అబద్ధం

  • ‘జిల్లాకో విమానాశ్రయం’ గత సర్కారు ప్రణాళికే
  • వాటిలో కొన్ని చంద్రబాబు హయాంలోనే పూర్తి
  • తిరుపతి, మధురపూడి, గన్నవరం పనులూ నాటివే
  • అశోక్‌ చేతిలో విమానయానంతో చకచకా విస్తరణ
  • కడప నుంచి నాలుగు నగరాలకు నాడు సర్వీసులు
  • ఇండిగోతో తాజాగా డీల్‌..కడప నుంచి సేవలు కుదింపు
  • కొత్తగా చేసిందేమీ లేదు.. తిరిగే విమానాలూ రద్దు
  • పాత ప్రతిపాదనలనే తమవిగా మళ్లీ మళ్లీ ప్రచారం 


జిల్లాకు ఒక విమానాశ్రయం.. బోయింగ్‌ విమానాలు సైతం దిగేలా రన్‌వేలు.. ఎయిర్‌పోర్టులపై సీఎం జగన్‌ ప్రణాళికలివీ! మంచిదే.. కానీ ఎగిరే విమానాలు లేక ఉన్నవే ఖాళీగా పడిఉన్నాయి. కొన్నింటిని సర్కారే రద్దు చేసుకుంది. మళ్లీ ఇప్పుడు కొత్తగా హడావుడి చేయడం వింతైతే.. 


అదీ అరువు ఆలోచనే కావడం విడ్డూరం! 

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా ఈ సీఎం మాటలు ఉంటున్నాయి. రోడ్ల గుంతలను పూడ్చలేని ముఖ్యమంత్రి.. జిల్లాకో విమానాశ్రయం కడతానని చెబుతున్నారు.

- టీడీపీ అధినేత చంద్రబాబు 


(అమరావతి, ఆంధ్రజ్యోతి): మాటలు ఆకాశంలో ఉన్నాయి. ఆకాశయానంపై ఈ ప్రభుత్వం మాటలు చూస్తే కొత్తగా ఏదో జరిగిపోతుందని అనిపిస్తుంది. కానీ, కొత్తగా జరగడం సంగతి అటుంచితే ఉన్న విమానాల రెక్కలూ ఈ మూడేళ్లలో విరిగిపోయాయి. రాష్ట్రంలో విమానాశ్రయాలన్నీ దాదాపు ఖాళీగా పడిఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే...ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం జిల్లాకో ఎయిర్‌పోర్టు ఉండాలి.. బోయింగ్‌ విమానం దిగేలా రన్‌వేలు అభివృద్ధి చేయాలి.. అని అంటున్నారు. నిజానికి, ఇవి కూడా కొత్త ప్రతిపాదనలు కావు. అన్నీ పాత మాటలే. గతంలో వేసిన ప్రణాళికలే. అప్పటి ప్రణాళికలను మళ్లీ చెప్పడం...చేతల్లో మాత్రం అది కూడా చేయకపోవడం జగన్‌ సర్కారుకే చెల్లింది.  జిల్లాకో విమానాశ్రయం అన్నది గత ప్రభుత్వ హయాంలోనే రూపొందించిన ప్రణాళిక. రాష్ట్రంలో 14 విమానాశ్రయాలు ఉండాలని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక వేసింది. దానిలో భాగంగా కడప, కర్నూలు విమానాశ్రయాలు ప్రారంభించింది. ఆ రెండు విమానాశ్రయాల నిర్మాణ పనులను పూర్తిచేసింది. అంతేకాకుండా గన్నవరం, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ పనులు చేపట్టింది. తిరుపతిలో కొత్త టెర్మినల్‌ నిర్మించారు. ఆకాశం నుంచి చూస్తే గరుడ పక్షిలా ఉండేలా ఈ టెర్మినల్‌ భవనాన్ని అద్భుతంగా నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి సమకూరిస్తే..కేంద్రం నిధులతో ఈ పనులు పూర్తిచేశారు.


 అంతే కాదు...గన్నవరం విమానాశ్రయం నుంచి తొలిసారి నేరుగా విదేశానికి విమానం ఎగిరింది టీడీపీ ప్రభుత్వంలోనే! అయితే, జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఒక్కో విమానాశ్రయం రెక్క తెగుతూ పోయింది. గన్నవరం నుంచి సింగపూర్‌కు గత ప్రభుత్వంలో ఎగిరిన విమాన సర్వీసు రద్దైంది. వాస్తవానికి ఈ సర్వీసు విజయవంతంగా నడిచింది. సింగపూర్‌ నుంచి తొలిసారి గన్నవరం విమానాశ్రయంలో దిగిన విమానంలో ఒక్క సీటు కూడా ఖాళీలేకుండా నిండిపోయాయి. అలాంటి విమాన సర్వీసును ఈ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసేశారు. అదేవిధంగా కడప నుంచి కేంద్ర ప్రభుత్వ పథకం ఉడాన్‌ కింద నాలుగు నగరాలకు విమాన సర్వీసులు ఏర్పాటుచేశారు. విజయవాడ, చెన్నై, బెల్గాం, హైదరాబాద్‌లకు ట్రూజెట్‌ విమానాలు నడి చేవి. ప్రతిరోజు వందల సంఖ్యలో ఇక్కడి నుంచి ఆయా నగరాలకు వెళ్లేవారు. కడప జిల్లానుంచి అరబ్‌ దేశాలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువ. వీరంతా కడప నుంచి చెన్నైకు వెళ్లి అక్కడినుంచి ఆరబ్‌దేశాలకు వెళ్లేందుకు వెసులుబాటు ఉండేది. అయితే ఈ సర్వీసులు కూడా గత కొంతకాలం నుంచి ఆగిపోయాయి. అసలు ఇప్పుడు కడప విమానాశ్రయం నుంచి విమానాలే ఎగరడం లేదు. ఇప్పుడు తాజాగా శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కడప, కర్నూలు నుంచి మళ్లీ విమానాలు నడిపేందుకు ఇండిగోతో ఒప్పందం చేసుకునేందుకు ఆమోదముద్ర వేశారు. అది కూడా కడప నుంచి గతంలోలా నాలుగు నగరాలకు కాకుండా రెండు నగరాలకే విమాన సర్వీసులు తిరిగేలా ఏర్పాటుచేశారు. 


భోగాపురం, గన్నవరం కార్గో నాటి ప్రణాళికే

రాష్ట్రంలో జిల్లాకో విమానాశ్రయం ఉండాలంటూ గత ప్రభుత్వ హయాంలోనే ప్రణాళిక వేశారు. వేయడమే కాదు దాని అమలులో ముందుకెళ్లి కొన్నింటిని పూర్తిచేశారు. అశోక్‌గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర సహకారంతో ఈ ప్రణాళికను ముందుకుతీసుకెళ్లారు. కర్నూలుకు సమీపంలోని ఓర్వకల్లు వద్ద విమానాశ్రయం ఏర్పాటుచేశారు. దానికి సంబంఽధించిన పనులన్నీ దాదాపుగా గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కడపలో విమానాశ్రయ టెర్మినల్‌, ఇతర పనులను పూర్తిచేసి అక్కడినుంచి విమానాలు నడిచేలా ఏర్పాట్లుచేశారు. రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయం కూడా కొత్తగా అభివృద్ది చేశారు. గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణను నాటి ప్రభుత్వమే పూర్తి చేసింది. ప్రతిగా భూములిచ్చిన రైతులు రాజధాని అమరావతిలో తమకు ప్లాట్లు ఇవ్వాలని అడిగితే ఆ పనిచేసి...భూసమీకరణ ప్రక్రియను విజయవంతంగా చేసింది. భోగాపురం విమానాశ్రయానికి ప్రణాళిక కూడా అప్పటిదే. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ విమానాశ్రయానికి ఇచ్చిన భూమిలో 500 ఎకరాలను వెనక్కితీసుకుంది. గత ప్రభుత్వం జీఎంఆర్‌ని ఎంపికచేయగా ఈ ప్రభుత్వమూ అదే సంస్థకు విమానాశ్రయ నిర్మాణ బాధ్యతను అప్పగించింది. అయితే అది ఆశించినంత వేగంగా ఏమీ వెళ్లడం లేదనే విమర్శలున్నాయి. గత ప్రభుత్వం రూపొందించినా, అంతకుముందు ప్రభుత్వాలు రూపొందించినా.. ఆయా ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడంలో తప్పులేదు. అది నిరంతర ప్రక్రియ. కానీ కొత్తగా ఏమీ చేయకుండా...పాత ప్రణాళికలను కొత్తగా చెప్పడం మాత్రం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2022-01-22T07:53:04+05:30 IST