మూడు షాపుల్లో చోరీ

ABN , First Publish Date - 2020-12-02T05:30:00+05:30 IST

అమలాపురం ఎర్ర వంతెన దిగువున జాతీయ రహదారిని ఆనుకుని బండారు గార్డెన్స్‌ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు షాపుల్లో దొంగలుపడ్డారు. తెల్లవారుజామున నడక వ్యాయామం చేసేవారు షాపుల షట్టర్లు పగులకొట్టి ఉండడాన్ని గుర్తించి వాటి యజమానులకు సమాచారం అందించారు.

మూడు షాపుల్లో చోరీ
సెల్‌ షాపులో చోరీ చేస్తుండగా సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యం

అమలాపురం టౌన్‌, డిసెంబరు 2: అమలాపురం ఎర్ర వంతెన దిగువున జాతీయ రహదారిని ఆనుకుని బండారు గార్డెన్స్‌ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు షాపుల్లో దొంగలుపడ్డారు. తెల్లవారుజామున నడక వ్యాయామం చేసేవారు షాపుల షట్టర్లు పగులకొట్టి ఉండడాన్ని గుర్తించి వాటి యజమానులకు సమాచారం అందించారు. వివరాలు ఇలా వున్నాయి... ఎర్ర వంతెన వద్దనున్న బాలాజీ ఫాస్ట్‌ట్రాక్‌ మొబైల్‌ షాపులో చోరులు ప్రవేశించి రూ.77వేలు నగదుతో పాటు పది టచ్‌ ఫోన్లు, నాలుగు  కీప్యాడ్‌ ఫోన్లు, ఇతర పరికరాలు దోచుకుపోయారని యజమాని గారపాటి బాలాజీ ఫిర్యాదు చేశాడు. మరో షాపు షట్టర్‌ పగులకొట్టినప్పటికీ ఏవిధమైన వస్తువులు పోలేదు. పక్కనే ఉన్న గాయత్రీ ఆక్వానీడ్స్‌లో రూ.9వేలు నగదు చోరీకి గురైనట్టు యజమాని టి.దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు చేశాడు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఆర్‌ఎస్‌కే బాజీలాల్‌ తెలిపారు. చోరీ జరిగిన షాపు లను పోలీసులు పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేశారు. ఎర్ర వంతెన వద్ద జరిగిన చోరీలకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన సమాచారాన్ని పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఇటీవల పేరూరు వై.జంక్షన్‌ సమీపంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎంలో రూ.23.85లక్షలు చోరీకి గురైన సంఘటన విదితమే. కాగా వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-12-02T05:30:00+05:30 IST