మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓట్లేస్తారు
ABN , First Publish Date - 2022-06-29T08:28:48+05:30 IST
మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే మాకు ఓట్లేస్తారు
సంక్షేమ పథకాల నడిసంద్రంలో జగన్.. మీరే రక్షించాలి
జనాన్ని కోరిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
ఆత్మకూరు, జూన్ 28: మొగుళ్లు వద్దన్నా వారి పెళ్లాలే తమకు ఓట్లేస్తారని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. మంగళవారం నంద్యాల జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల మహిళలే తమకు ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలుతో సీఎం జగన్ నడిసముద్రంలో చిక్కుకున్నారని, ఆయన్ని మీరే దాటించాలని జనాన్ని కోరారు. సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు వస్తే కార్యకర్తలుకూడా అదేస్థాయిలో ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ బీజేపీ విధానాల వల్లే పెట్రోలు, గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరిగాయని, అయితే ప్రతిపక్షాలు బీజేపీపై తిరుగుబాటు చేయకుండా తమపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ పీపీ.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్లీనరీ సమావేశంలో ముఖ్యనేతలు మాట్లాడే సమయానికి జనం వెళ్లిపోవడంతో కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయి. రామసుబ్బారెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడే సమయానికి ఎక్కువ శాతం ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఒక్కపూట తినకపోతే ఏమవుతుంది... ఆగండి అంటూ ఎమ్మెల్యే శిల్పా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిం ది. కార్యక్రమం చప్పగా సాగుతుండగా చప్పట్లు కొట్టమని జనాన్ని అడిగినా స్పందన రాలేదు.