జలదాయినీ.. జనవాహినీ..

ABN , First Publish Date - 2021-10-17T05:23:03+05:30 IST

జలదాయినీ.. జనవాహినీ..

జలదాయినీ.. జనవాహినీ..
కృష్ణానదిలో తెప్పోత్సవం

ఘనంగా ముగిసిన శరన్నవరాత్రి మహోత్సవాలు

ఘనంగా హంసవాహన సేవ

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ భక్తులు

శ్రీరాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ దర్శనం

ఉత్సవ ఏర్పాట్లు నేడూ కొనసాగింపు 

శతకోటి విద్యుల్లతలు కృష్ణమ్మ ఒడిలో ఒదగగా, దుర్గమ్మ తెప్పోత్సవం వేయి వెలుగుల రేకులుగా విచ్చుకుంది. ఆకాశాన మెరుపుల మైమరపులు.. తీరాన భక్తకోటి పరవశాలు మెరిసి మురిశాయి. ముమ్మారు జలవిహారం జరగకపోయినప్పటికీ తెప్పోత్సవ తుదిఘట్టం భక్తజనుల కళ్లల్లో దివ్యకాంతులు నింపింది. తొమ్మిది రోజులు తొమ్మిది క్షణాల్లా గడిచినా ఆ తల్లిని తిలకించి తన్మయత్వం పొందాలన్న తలంపుతో జనవాహినీ ఇంకా ముందుకు కదులుతూనే ఉంది. ఫలితంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసినా అమ్మ దర్శనానికి భవానీ భక్తులు బారులు తీరుతూనే ఉన్నారు.

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) :  ఇంద్రకీలాద్రి అరుణవర్ణాన్ని పులుముకుంది. భవానీ మాలధారులతో కోలాహలంగా మారింది. రాష్ట్ర నలుమూలల దీక్ష స్వీకరించిన భక్తులు కొండపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఇరుముళ్లతో శనివారం భారీసంఖ్యలో పోటెత్తారు. దీంతో వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. కొండపైకి వాహనాలను నిలుపుదల చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదివారం కూడా ఉత్సవ ఏర్పాట్లను కొనసాగిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో విజయవంతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలికారు. చివరిరోజు దుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిచ్చింది. లక్షలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించుకున్నారు. క్యూలైన్లలోకి వెళ్లిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తిరిగి కొండ దిగి రావడానికి సుమారు 6 గంటల సమయం పట్టింది. శనివారం కూడా దుర్గమ్మ రాజరాజేశ్వరీదేవి అలంకారంలోనే దర్శనమిచ్చింది. 

ఘనంగా హంసవాహన సేవ

శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆదిదంపతులకు తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు దుర్గాఘాట్‌ వద్ద కృష్ణానదీ జలాల్లో నిర్వహించిన ఈ ఉత్సవం భక్తులను కనువిందు చేసింది. గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామివార్ల త్రిలోక సంచారానికి గుర్తుగా నదిలో ముమ్మారు జలవిహారం చేయించాల్సి ఉన్నప్పటికీ, వరద ఉధృతి కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. దుర్గాఘాట్‌ వద్ద హంస వాహనాన్ని నిలిపి ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు పోలీసుల ఆధ్వర్యంలో వన్‌టౌన్‌లో ఉత్సవమూర్తులను ఘనంగా ఉరేగించారు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ జి.వాణీమోహన్‌, కలెక్టర్‌ జె.నివాస్‌, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత, సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌, దుర్గగుడి ఈవో భ్రమరాంబ, పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు తదితరులు హంస వాహనంపై ఆది దంపతులకు ప్రత్యేక పూజలు చేశారు.  
















Updated Date - 2021-10-17T05:23:03+05:30 IST