39 పోస్టులకు ఉన్నది తొమ్మిది మందే!

ABN , First Publish Date - 2022-01-22T04:38:38+05:30 IST

ఏడాదిగా అధికారులు లేరు.. సిబ్బంది సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది.

39 పోస్టులకు ఉన్నది తొమ్మిది మందే!

సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాలశాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత

ఏడాదిగా డీఎస్వో, ఆర్నెళ్లుగా ఏఎస్వో పోస్టులు ఖాళీ

23 మంది డిప్యూటీ తహసీల్దార్లకు పనిచేస్తున్నది ఆరుగురు మాత్రమే

మిగిలిన పోస్టులదీ ఇదే పరిస్థితి

పనితీరుపై తీవ్ర ప్రభావం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జనవరి 21: ఏడాదిగా అధికారులు లేరు.. సిబ్బంది సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. దాంతో ప్రధాన ప్రభుత్వ శాఖ అయిన పౌరసరఫరాల శాఖ పనితీరు జిల్లాలో అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లా స్థాయిలో పౌరసరఫరాల శాఖ కీలకమైనది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే రేషన్‌ డీలర్ల నియామకం మొదలు  గ్యాస్‌ సిలిండర్ల సరఫరా, పెట్రోలు బంకులు, బియ్యం అక్రమ రవాణాను అరికట్టడం వంటి చర్యలను పౌరఫరాల శాఖ యంత్రాంగమే చేపట్టాల్సి ఉంటుంది. జిల్లాలో 68 రేషన్‌ దుకాణాలకు డీలర్ల నియామకం కూడా జరగని పరిస్థితి నెలకొన్నది. అలాంటి శాఖ నిర్వహణకు జిల్లా స్థాయిలో 39 పోస్టులు ఉండగా కేవలం 9 మంది ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు.


డీఎస్వో పోస్టు ఏడాదిగా ఖాళీ

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి (డీఎస్వో )పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉన్నది. గతంలో డీఎస్వోగా పనిచేసిన శ్రీకాంత్‌రెడ్డి గతేడాది జనవరి 21న హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఏడాదిగా ఆయన స్థానంలో మరెవరినీ నియమించలేదు. సహాయ పౌరసరఫరాల అధికారి (ఏఎస్వో) శివప్రసాద్‌రెడ్డిని డిప్యూటేషన్‌పై నాగర్‌కర్నూల్‌కు బదిలీ చేశారు. ఆర్నెళ్లయినా ఈ పోస్టును కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదు. 23 డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టులకు ప్రస్తుతం ఆరుగురే పనిచేస్తున్నారు. మిగిలినవారిలో తొమ్మిది మంది డిప్యూటీ తహసీల్దార్లు జీవో 317 ప్రకారం ఇతర జిల్లాలకు కేటాయించబడ్డారు. వీరి స్థానాల్లో ఇతర జిల్లాల నుంచి ఎవరూ రాలేదు. మరో ఎనిమిది మంది డిప్యూటీ తహసీల్దార్లు డిప్యూటేషన్‌పై కలెక్టరేట్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో కేవలం ఆరుగురు డిప్యూటీ తహసీల్దార్లు, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌, ఇద్దరు అటెండర్‌ మాత్రమే పనిచేస్తున్నారు. సిబ్బంది కొరతతో పౌరసరఫరాల కార్యకలాపాలకు ఆటంకం కలుగుతున్నది.

Updated Date - 2022-01-22T04:38:38+05:30 IST