Narendra Modi: గుజరాత్ ప్రతిష్ట, పెట్టుబడులు దెబ్బతీసేందుకు కుట్రలు జరిగాయి
ABN , First Publish Date - 2022-08-28T23:24:03+05:30 IST
గుజరాత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, పెట్టుబడులు ఆగిపోయేలా చేసేందుకు కుట్రలు జరిగినట్టు ప్రధానమంత్రి నరేంద్ర..
భుజ్: గుజరాత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు, పెట్టుబడులు ఆగిపోయేలా చేసేందుకు కుట్రలు జరిగినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భుజ్ జిల్లాలో అదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, గుజరాత్ను దేశ విదేశాల్లో అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు జరిగాయని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పదేపదే ప్రయత్నాలు జరిగాయని, అయినప్పటికీ గుజరాత్ అభివృద్ధి మార్గాన్ని ఎంచుకుందని అన్నారు.
''కచ్లో 2001లో వచ్చిన భూకంపం విలయం సృష్టించింది. అప్పుడే కచ్ పునర్మిర్మాణం గురించి నేను మాట్లాడాను. అందుకోసం పనిచేశాం. ఈరోజు ఆ ఫలితాలను మీరు స్వయంగా చూస్తున్నారు'' అని ఆయన అన్నారు. భూకంపం తర్వాత కచ్ ఎప్పటికీ కోలుకోదని చాలా మందే అన్నారని, అయితే ప్రజలు పట్టుదలతో అభివృద్ధిని సాధించి చూపించారని అన్నారు. ప్రస్తుతం దేశంలో చాలా లోటుపాట్లు కనిపించవచ్చని, కానీ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలవడం ఖాయమని అన్నారు.
భుజ్లో రోడ్షో...
దీనికి ముందు, కచ్ జిల్లాలో జరిగిన రోడ్షోలో ప్రధాని పాల్గొన్నారు. భుజ్, పరిసర ప్రాంతాల్లోని రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున ప్రజలు మోదీకి త్రివర్ణ పతాకాలు ఊపుతూ స్వాగతం పలిగారు. హిల్ గార్డెన్ సర్కిల్ నుంచి జిల్లా పరిశ్రమల కేంద్ర వరకూ సుమారు 3 కిలోమీటర్లు ఈ రోడ్షో జరిగింది. అనంతరం భుజ్ శివార్లలో భూకంప బాధితుల కోసం నిర్మించిన స్మారకాన్ని, 2001 భూకంపంలో చనిపోయిన పిల్లల స్మృతి చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. సర్హద్ డెయిరీ మిల్క్ ప్రాససింగ్ ప్లాంట్ను ప్రారంభించారు.