ఈ కీలక నేత కూడా ఈటల వెంటే కాషాయ గూటికి!

ABN , First Publish Date - 2021-06-13T15:58:55+05:30 IST

ఈటల రాజేందర్‌తోపాటు ఈనెల 14న బీజేపీలో చేరడానికి

ఈ కీలక నేత కూడా ఈటల వెంటే కాషాయ గూటికి!

  • ఈటల వెంట కాషాయ గూటికి కేశవరెడ్డి!


హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాషాయ గూటికి చేరుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వెంట నడవాలని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు సాద కేశవరెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈటల రాజేందర్‌తోపాటు ఈనెల 14న బీజేపీలో చేరడానికి కేశవరెడ్డి సన్నద్ధమయ్యారని సమాచారం. ఈటల రాజేందర్‌ సతీమణి జమునా రెడ్డికి బంధువు కూడా కావడంతో మొదటి నుంచీ ఈటల కుటుంబంతో కేశవరెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. సాద కేశవరెడ్డి తొలిసారి 2006వ సంవత్సరంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ 2వ వార్డు నుంచి కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయారు. రెండు సంవత్సరాల తర్వాత బోర్డు పాలక మండలి రద్దు కావడంతో 2008లో మళ్లీ ఎన్నికలు జరగగా, ఇదే వార్డు నుంచి కాంగ్రెస్‌ మద్దతుతో విజయం సాధించారు. 


2015లో టీఆర్‌ఎస్‌ మద్దతుతో 2వ వార్డు నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో మూడు నెలల పాటు కంటోన్మెంట్‌ పాలక మండలి ఉపాధ్యక్షుడిగా కేశవరెడ్డి కొనసాగారు. తిరిగి 2015 నుంచి రెండున్నర సంవత్సరాల పాటు బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కొద్ది రోజులుగా ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ నేపథ్యంలో కేశవరెడ్డి కూడా బీజేపీలో చేరవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజాగా శనివారం ఈటలతోపాటు గన్‌పార్క్‌ వద్దనున్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్దకు తన అనుచరులతో కలిసి కేశవరెడ్డి వెళ్లారు. ఈటలతో పాటు బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్న కేశవరెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేయనున్నారని తెలిసింది. ఈపాటికే కంటోన్మెంట్‌ పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌, జె.రామకృష్ణ బీజేపీలో చేరిన నేపథ్యంలో కేశవరెడ్డి కూడా బీజేపీ కండువా కప్పుకోనుండడం గమనార్హం.

Updated Date - 2021-06-13T15:58:55+05:30 IST