వారలా.. వీరిలా!
ABN , First Publish Date - 2022-09-30T05:16:52+05:30 IST
వారలా.. వీరిలా!
పోడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాచరణ
అప్పటివరకు భూముల్లోకి వెళ్లొద్దని అటవీశాఖకు ఆదేశం
క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా పరిస్థితులు
అడుగడుగునా సాగును అడ్డుకుంటున్న అటవీఅధికారులు
నిత్య ఘర్షణలతో రణరంగమవుతున్న ఏజెన్సీ ప్రాంతాలు
అశ్వారావుపేట, సెప్టెంబరు 29: ఏజెన్సీ ప్రాంతాల్లో మళ్లీ పోడు గొడవలు పెరిగిపోతున్నాయి. అటవీశాఖ అధికారులకు పోడుసాగుదారులకు మధ్య రోజూ ఏదో ఒకచోట పోడు వివాదం తలెత్తుతూనే ఉంది. గత ఏడెనిమిదేళ్లుగా ప్రభుత్వం పోడు భూముల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోడు సమస్యలను పరిష్కరిస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అటవీ అధికారులు పోడుభూముల జోలికి వెళ్లరని ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి నుంచి కిందస్థాయి నేతల వరకు గిరిజనులకు భరోసా కల్పించడంతో దశాబ్ధాల తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పోడుసాగుదారులు ఆశలు పెంచుకున్నారు. కానీ కొద్దిరోజులుగా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న పరిణామలు ప్రభుత్వం ప్రకటకు విరుద్దంగా ఉండటంతో పోడుసాగుదారుల్లో ఆందోళన, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి జిల్లాలో లక్షన్నర ఎకరాల్లో పోడు సాగు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు లక్షన్నర ఎకరాల్లో గిరిజనులు పోడుసాగు చేస్తున్నారు. ఆయా భూములను 2006 అటవీహక్కుల చట్టం ఏర్పాటుకు ముందు నుంచీ తాము సాగుచేసుకుంటున్నామని గిరిజనులు తెలిపారు. గతంలో పట్టాలు ఇచ్చే సమయంలో కొందరు అటవీశాఖ అధికారులు పక్షపాత ధోరణితో ప్రతి మండలంలోను వేలాది ఎకరాల అర్హులైన భూములకు పట్టాలివ్వలేదని, పట్టాలు జారీ చేసిన పట్టాలన్నీ వారికి అనుకూలమైనవారికే జారీ చేశారని గిరిజనులు అప్పటి నుంచి ఆరోపిస్తున్నారు. కానీ ఆ ఆరోపణల్లో నిజం లేదని ప్రస్తుతం గిరిజనులు సాగుచేస్తున్న భూములన్నీ అటవీహక్కుల చట్టం అమలు చేసిన తరువాత అడవులను నిరికి సాగుచేసుకుంటున్నవేనని అటవీశాఖాధికారులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 15 సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అటవీశాఖాధికారులు, గిరిజనుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు, వాదోపదాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లా వ్యాప్తంగా గిరిజనులు సాగులో ఉన్న వేలాది ఎకరాల సాగుభూమిని స్వాధీనం చేసుకొని ప్లాంటేషన్లు వేశారు. మిగతా భూమిని స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖాధికరులు విశ్వప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు, వాగ్వాదాలు జరుగుతున్నాయి. వందల మంది గిరిజనులపై కేసులు నమోదవున్నాయి.
ఆశలు కల్పించిన ప్రభుత్వ ప్రకటన..
మరో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏజెన్సీ జిల్లాల్లో పోడు సాగుదారుల నుంచ్చి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయంటూ ఆయా ప్రాంతాలలోని ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల ఒత్తిడులతో ప్రభుత్వం పోడుసాగుదారులకు అనుకూలంగా ప్రకటనలు చేసింది. సమస్య పరిష్కారంకోసం ఓ జీఓను విడుదల చేసి కమిటీలను వేసేందుకు సిద్దమైంది. అయితే ఈ జీవో చెల్లదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలాఉండగా పోడు సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని, అప్పటి వరకు అటవీశాఖాధికారులు గిరిజనుల జోలికి వెళ్లరని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించి భరోస కల్పించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
అనేకచోట్ల అడ్డుకుంటున్న అటవీఅధికారులు
ప్రభుత్వ ప్రకటనతో ఎంతో దీమాతో ఉన్న పోడుసాగుదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రభుత్వం కమిటీలు వేస్తున్నట్లు ప్రకటించి కొద్దిరోజులు కూడా గడవకముందే పోడుభూముల్లో సాగుచేసుకుంటున్న గిరిజనులకు అటవీ అధికారులనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. గత కొద్ది రోజులుఉగా భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలోని బండారిగుంపు, దురదపాడు, గాండ్లగూడెం గ్రామాలలో అటవీ అధికారులు పోడు సాగును అడ్టుకుంటున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. పలువురు గిరిజనులపై కేసులు కూడా నమోదయ్యాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ అటవీ అధికారులు పోడు సాగును అడ్డుకుంటున్నారు. దాంతో అసలేంజరుగుతుందో అర్థంకాక గిరిజనులు అందోళన చెందుతున్నారు. తాజా పరిణామాలను చూసి అసలు తమకు పోడు పట్టాలు వస్తాయోరావో అనే అనుమానాలను గిరిజనులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒక తీరున, అటవీఅధికారులు మరోలా వ్యవహరిస్తుండడం పట్ల గిరిజనుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పోడు సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్న గిరిజన ప్రజాప్రతినిధులకు తాజా పరిణామాలు సవాల్గా మారాయి.
పోడు సమస్యల పరిష్కారానికి ఎఫ్ఆర్సీ కమిటీ
భద్రాద్రి కలెక్టర్ అనుదీప్
కొత్తగూడెం కలెక్టరేట్, సెప్టెంబరు 29: పోడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు భద్రా ద్రి కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కొత్తగూడెంలో గురువారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పాలొ ్గన్న కలెక్టర్ అనుదీప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పోడు భూ ముల సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్ఆర్సీ కమిటీని నియమించినట్లు తెలిపారు. భద్రాద్రి జిల్లాలో 343 పంచాయతీల పరిధిలో పోడు సమస్యలున్నాయని తెలిపారు అడవులను కాపాడుకుంటూనే పోడు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. గత ఏడాది చివరలో స్వీకరించిన పోడు దరఖాస్తుపై విచారణ నిర్వహించి అర్హులైన వారికి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించామన్నారు.