యూపీలో థర్డ్ వేవ్ అడుగుపెట్టింది: యోగి
ABN , First Publish Date - 2022-01-10T20:35:10+05:30 IST
ఉత్తరప్రదేశ్లో కోవిడ్ థర్డ్ వేవ్ అడుగుపెట్టిందని, అయితే దీనివల్ల అంతగా ప్రమాదమేమీ..
లక్నో: ఉత్తరప్రదేశ్లో కోవిడ్ థర్డ్ వేవ్ అడుగుపెట్టిందని, అయితే దీనివల్ల అంతగా ప్రమాదమేమీ లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 33,900 యాక్టివ్ కేసులున్నాయని, అయితే 90 శాతం మందిలో వ్యాధి లక్షణాలు లేవని, వీరు హోం ఐసొలేషన్లో ఉన్నారని చెప్పారు. కోవిడ్ పేషెంట్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు ప్రతి జిల్లాలో కోవిడ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి, మెడికల్ కిట్స్ అందిస్తున్నట్టు తెలిపారు.
కాగా, యూపీలో తాజాగా 7,695 కొత్త కేసులు నమోదు కాగా, నలుగురు మృత్యువాత పడ్డారు. మీరట్, ప్రయాగరాజ్, బులంద్షహర్, బుదౌన్లో ఒక్కో మరణం చోటుచేసుకుంది. గత 24 గంటల్లో 2.2 లక్షలకు పైగా శాంపుల్స్ పరీక్షించినట్టు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గౌతం బుథ్ నగర్, ఘజియాబాద్లలో కోవిడ్ యాక్టివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో సుమారు 30.44 శాతం ఇక్కడి నుంచే నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే గౌతం బుధ్ నగర్లో 1,100కు పైగా కేసులు నమోదుకాగా, ఘజియాబాద్లో 1000 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.