ఇదేం వ్యూహమో!

ABN , First Publish Date - 2020-12-04T04:24:28+05:30 IST

ఒకేసారి మూడు ప్రభుత్వ కార్యాలయాల్లో చోరీ. అదీ కొద్ది గంటల వ్యవధిలో. ఈ మూడు కార్యాలయాల్లోనూ కంప్యూటర్లను మాత్రమే దోచుకెళ్లారు. సాధారణంగా నగదు, ఇతరత్రా దొంగతనానికి గురవుతుంటాయి. దీనికి భిన్నంగా కంప్యూటర్లు మాత్రమే చోరీకి గురవడం అనుమానాలకు తావిస్తోంది. గుర్ల మండల కేంద్రంలో బుధవారం అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఇదేం వ్యూహమో!
విచారిస్తున్న ఎస్‌ఐ దామోదరావు


 మూడు కార్యాలయాల్లో కంప్యూటర్లు మాయం

 గుర్ల, డిసెంబరు 3: ఒకేసారి మూడు ప్రభుత్వ కార్యాలయాల్లో చోరీ. అదీ కొద్ది గంటల వ్యవధిలో. ఈ మూడు కార్యాలయాల్లోనూ కంప్యూటర్లను మాత్రమే దోచుకెళ్లారు. సాధారణంగా నగదు, ఇతరత్రా దొంగతనానికి గురవుతుంటాయి. దీనికి భిన్నంగా కంప్యూటర్లు మాత్రమే చోరీకి గురవడం అనుమానాలకు తావిస్తోంది. గుర్ల మండల కేంద్రంలో బుధవారం అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న వెలుగు, ఉపాధి హామీ, ఎంపీడీవో కార్యాలయాల్లో బుధవారం అర్ధరాత్రి కంప్యూటర్‌లను దొంగలు ఎత్తుకెళ్లారు. తలుపులు బద్దలుకొట్టి మాయం చేశారు. వెలుగులో ఒకటి, ఉపాధి హామీలో రెండు, ఎంపీడీవో కార్యాలయంలో ఒక కంప్యూటర్‌ చోరీకి గురైనట్టు గుర్ల పోలీసులకు గురువారం ఎంపీడీవో, వెలుగు సిబ్బంది కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్లు మాయమయ్యాయి. అదే విధంగా ఇప్పుడూ జరగడంతో దీనిలో ఎవరి ప్రమేయం ఉందా అనే దానిపై విచారణ మొదలైంది. గుర్ల ఎస్‌ఐ లేకపోవడంతో నెల్లిమర్ల ఎస్‌ఐ దామోధరావు ఘటనా స్థలాన్ని గురువారం పరిశీలించారు. రూరల్‌ సీఐ మంగవేణి కూడా వివరాలను సేకరించారు. విజయనగరం నుంచి క్లూస్‌ టీమ్‌ వచ్చి వేలిముద్రలను పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. కంప్యూటర్ల చోరీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమైన సమాచారం మాయం చేసేందుకే ఎవరో ఈ పని చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఉపాధి పనుల్లో  ఇటీవల జరిగిన అవకతవకలు... అభివృద్ధి పనుల వివరాలు లేకుండా చేయదలిచారా? ఇతరత్రా ఏదైనా సమాచారాన్ని మాయం చేయాలనుకున్నారా? అనే అంశాలపై చర్చ సాగుతోంది.

 

Updated Date - 2020-12-04T04:24:28+05:30 IST