ప్రజాస్వామ్యాన్ని నడపడం ఇలాకాదు: రాహుల్

ABN , First Publish Date - 2021-12-14T19:54:12+05:30 IST

పార్లమెంటులో గందరగోళం మధ్య బిల్లు వెంట బిల్లు ఆమోదించుకుంటూ పోతున్నారని..

ప్రజాస్వామ్యాన్ని నడపడం ఇలాకాదు: రాహుల్

న్యూఢిల్లీ: పార్లమెంటులో గందరగోళం మధ్య బిల్లు వెంట బిల్లు ఆమోదించుకుంటూ పోతున్నారని, పార్లమెంటును నడిపే పద్ధతి ఇది కాదని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చురకలు వేశారు. ప్రధాని సభకు రారని, జాతీయ ప్రాధాన్యం కలిగిన ఏ అంశాన్ని ప్రస్తావించేందుకు విపక్షాలను అనుమతించరని, ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా ఖూనే చేస్తుండటం దురదృష్టకరమని అన్నారు. 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో రాహుల్ గాంధీ మంగళవారంనాడు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రజాసామ్యం గొంతు నులుపుతున్నారని విమర్శించారు. ఎంపీలు చేసిన తప్పేమీ లేదని, పార్లమెంటులో కీలకాంశాలపై చర్చిచేందుకు విపక్షాలను అనుమతించడం లేదని రాహుల్ పేర్కొన్నారు. ''ఒక మంత్రి రైతులను చంపాడు. ప్రధానికి ఆ విషయం తెలుసు. ఇద్దరు ముగ్గురు కేపిటలిస్టులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నారు. ఎంపీలను రాజ్యసభ చైర్మనో, ప్రధానో సస్పెండ్ చేయలేదు. కానీ అధికారంతో రైతుల ఆదాయాన్ని దొంగిలించాలని వారు కోరుకుంటున్నారు. ప్రధాని కానీ చైర్మన్ కానీ కేవలం వాటిని అమలు చేస్తున్నారు'' అని రాహుల్ విమర్శలు గుప్పించారు.


పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకూ నిరసన ప్రదర్శన

కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజు నుంచి సస్పెన్షన్‌కు గురైన రాజ్యసభ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇందుకు విపక్షాలు మద్దతుగా నిలవడంతో ఉభయసభలూ సజావుగా సాగడం లేదు. రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్ రద్దు చేయాలంటూ మంగళవారంనాడు విపక్ష ఎంపీలంతా పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

Updated Date - 2021-12-14T19:54:12+05:30 IST